ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పోరాటం ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో ఉప్పల్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. సరిగ్గా సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సమయానికి భారీ వర్షం రావడంతో మ్యాచ్కు అంతరాయం కలిగింది. వర్షం ఆగిపోయినా.. మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. దాంతో కాసేపు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్ను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ నిర్ణయంతో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆవిరయ్యాయి.
ఈ మ్యాచ్ గెలిచి ఉంటే సన్రైజర్స్ హైదరాబాద్కు కాస్తో కూస్తో ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండేవి. వర్షం కారణంగా రద్దవ్వడంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో ఓ పాయింట్ చేరింది. దాంతో 11 మ్యాచ్ల్లో ఆరెంజ్ ఆర్మీ మూడు విజయాలతో 7 పాయింట్స్తో 8వ స్థానంలో నిలిచింది. చివరి మూడు మ్యాచ్లు గెలిచిన ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో 13 పాయింట్స్ చేరుతాయి.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు 11 మ్యాచ్ల్లో 6 విజయాలు.. ఓ మ్యాచ్ రద్దుతో 13 పాయింట్స్తో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి మూడు మ్యాచ్ల్లో కనీసం రెండు విజయాలు సాధించాలి. అప్పుడే 17 పాయింట్స్తో టోర్నీలో ముందుడుగు వేస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ గెలిచి ఉంటే ఆ జట్టు పరిస్థితి మరోలా ఉండేది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు మాత్రమే చేసింది. ట్రిస్టన్ స్టబ్స్(36 బంతుల్లో 4 ఫోర్లతో 41 నాటౌట్), అషుతోష్ శర్మ(26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 41) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(3/19) మూడు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. జయదేవ్ ఉనాద్కత్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీసారు. ప్రత్యర్థిని తక్కువ స్కోర్కు పరిమితం చేశామనే సన్రైజర్స్ ఆనందాన్ని వరుణుడు ఆవిరి చేశాడు. మరోవైపు వర్షం కారణంగా ఢిల్లీ ఓటమిని తప్పించుకుంది.