Sreesanth vs Gambhir: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. మాజీ పేసర్ శ్రీశాంత్ మైదానంలో వాగ్వాదానికి దిగారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఈ లెజెండరీ ఆటగాళ్లు గొడవపడ్డారు.
ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. అంపైర్లు సర్దిచెప్పినా.. సహచర ఆటగాళ్లు వారించినా వెనక్కి తగ్గలేదు. ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇండియా క్యాపిటల్స్ జట్టును గౌతమ్ గంభీర్ నడిపిస్తుండగా.. గుజరాత్ జెయింట్స్ జట్టుకు శ్రీశాంత్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
అయితే ఇండియా క్యాపిటల్స్ బ్యాటింగ్ సందర్భంగా శ్రీశాంత్ వేసిన రెండో ఓవర్లో గౌతమ్ గంభీర్ తొలి రెండు బంతులను 6, 4 గా బౌండరీకి తరలించాడు.

దాంతో శ్రీశాంత్ అసహనానికి గురయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు సీరియస్గా చూసుకున్నారు. ఆ తర్వాత శ్రీశాంత్ ఫీల్డింగ్ చేస్తుండగా.. అతన్ని ఉద్దేశించి గంభీర్ ఏవో వ్యాఖ్యలు చేశాడు. దాంతో శ్రీశాంత్ ఆగ్రహానికి గురయ్యాడు. అతనిపైకి దూసుకెళ్లాడు. శ్రీశాంత్ అత్యుత్సాహం కారణంగా ఈ గొడవ జరిగిందంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.
దాంతో ఈ గొడవకు గల కారణాన్ని తెలియజేస్తూ శ్రీశాంత్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. తనను అసభ్యకర పదజాలంతో దూషించడంతోనే ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చిందన్నాడు. 'గంభీర్తో తనకు జరిగిన గొడవ విషయంలో అందరూ పొరబడుతున్నారు. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఈ గొడవపై క్లారిటీ ఇచ్చేందుకే లైవ్లోకి వచ్చాను.
గంభీర్.. తన పెయిడ్ పీఆర్తో నాపై అసత్య ప్రచారం చేస్తున్నాడు. అతనిలా తప్పుడు ప్రచారం చేసేందుకు నా దగ్గర డబ్బులు లేవు. నేను ఓ సాధారణ మనిషిని. ఈ గొడవలో నేను ఒక్క పదం కూడా తప్పుగా మాట్లాడలేదు. నోరు జారలేదు. నేను కేవలం 'ఏం అన్నావ్.. ఏం అన్నావ్..?'అని మాత్రమే గంభీర్ను ప్రశ్నించాను.
అతను ఫిక్సర్ ఫిక్సర్.. ఫ*ఆఫ్ ఫిక్సర్ అనే బూతుపదం వాడాడు. ఈ పదం లైవ్లో అంటున్నందుకు క్షమించండి. ఇలాంటి పదం వాడటంతోనే నేను ఆగ్రహానికి గురయ్యాను. అంపైర్లు అడ్డుకున్నప్పుడు కూడా గంభీర్.. ఇదే బూతు పదం వాడాడు. నేను వెనక్కి వెళ్లినా పదే పదే ఆ పదాన్ని వాడాడు.'అని శ్రీశాంత్ క్లారిటీ ఇచ్చాడు.
ఈ మ్యాచ్లో ఇండియా క్యాపిటల్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ ఏడు వికెట్లకు 223 పరుగులు చేసింది. గంభీర్ 30 బంతుల్లో 51 పరుగులు చేశాడు. గుజరాత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీశాంత్ మూడు ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. అనంతరం ఛేజింగ్ లో గుజరాత్ జెయింట్స్ ఏడు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది.