టీమిండియా మాజీ పేసర్, వరల్డ్ కప్ విన్నర్ శ్రీశాంత్ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన కాలాన్ని గుర్తు చేసుకున్నాడు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో తనను ఓ ఉగ్రవాదిలా చూశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2013 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్.. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జట్టులోని అజిత్ చండిలా, అంకిత్ చవాన్లతో కలిసి శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
బీసీసీఐ కూడా అతనిపై నిషేధం విధించింది. దాంతో శ్రీశాంత్ కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోయింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత కోర్టు శ్రీశాంత్ను నిర్దోషిగా ప్రకటించింది. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, బీసీసీఐ అతనిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించింది. నిషేధం ముగిసిన తర్వాత శ్రీశాంత్ దేశవాళీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చినా మునపటిలా సత్తా చాటలేకపోయాడు. దాంతో క్రికెట్కు వీడ్కోలు పలికి కామెంటేటర్గా, విశ్లేషకుడిగా, సినీ నటుడిగా తన రెండో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు.

తాజాగా తన సతీమణి భువనేశ్వరి కుమారితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీశాంత్... స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యాడు. 'నా జీవితంలోనే స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాన్ని మరిచిపోలేను. నా వివాహ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే అరెస్ట్ కావడం అతిపెద్ద విషాదం. 2012లో నాకు ఆరు సర్జరీలు జరిగాయి, నేను వీల్ చైర్కే పరిమితమయ్యాను. అదే సమయంలో నాపై ఉగ్రవాది అనే ముద్ర వేశారు. నా మామగారి దగ్గరకు వెళ్లి.. 'నేను మళ్ళీ క్రికెట్ ఆడలేకపోవచ్చు, పైగా నాపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి' అని చెప్పాను.'అని శ్రీశాంత్ గుర్తు చేసుకున్నాడు.
శ్రీశాంత్పై వచ్చిన ఆరోపణలను తాను నమ్మలేదని అతని సతీమణి భవనేశ్వరి వివరించింది.'శ్రీశాంత్ అరెస్ట్ వార్త ఒక షాక్ లాంటిది. నా స్నేహితులు ఫోన్ చేసి టీవీ చూడమని చెప్పే వరకు నాకు ఈ విషయం తెలియదు. టీవీలో 'శ్రీశాంత్ అరెస్ట్' అనే వార్త చూసి నేను షాక్కు గురయ్యాను. వెంటనే మా నాన్న దగ్గరకు వెళ్లి ముందు నాకు ఒక మాట ఇవ్వండి.. నా పెళ్లి ఆపకూడదని కోరాను. స్వయంగా ఆ దేవుడే వచ్చి శ్రీశాంత్ తప్పు చేశాడని చెప్పినా నేను నమ్మను.'అని తన తండ్రితో గట్టిగా చెప్పినట్లు భువనేశ్వరి గుర్తు చేసుకున్నారు.