వారెవ్వా శ్రీశాంత్ వాటే రీ ఎంట్రీ.. 2804 రోజుల తర్వాత ఫస్ట్ మ్యాచ్లోనే! (వీడియో)

ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పునరాగమనం చేశాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఏడేళ్ల నిషేధం పూర్తి చేసుకుని తిరిగి క్రికెట్ ఆడేందుకు గతేడాది అర్హత సాధించిన ఈ కేరళ స్టార్.. ముస్తాక్ అలీ ట్రోఫీతో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ టోర్నీలో కేరళకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను తన తొలి మ్యాచ్లో సోమవారం పుదుచ్చేరిపై 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకొని సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు.

2804 రోజుల తర్వాత..
టూ టైమ్ వరల్డ్ కప్ విన్నర్ అయిన శ్రీశాంత్ 2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతూ.. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధానికి గురయ్యాడు. దీనిపై సవాల్ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతని నిషేధాన్ని సమర్థించింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
అక్కడ ఈ కేరళ పేసర్కు ఊరట లభించింది. శ్రీశాంత్ను దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్మన్ డీకే జైన్ 2019లో నిర్ణయం తీసుకున్నాడు. దాంతో గతేడా ఏడాది సెప్టెంబర్తో శ్రీశాంత్ శిక్షాకాలం పూర్తయింది. దేశంలోనే మేటీ స్వింగ్ బౌలర్ అయిన శ్రీశాంత్ కేరళ జట్టులో చేరి ముస్తాక్ అలీతో ప్రొఫెషనల్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 2804 రోజుల తర్వాత మళ్లీ ఫ్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.

బోల్డ్ కామెంట్స్..
ఇక తన పునరాగమనంకు ముందు శ్రీశాంత్ చాలా బోల్డ్ కామెంట్స్ చేశాడు. భారత జట్టుకు మళ్లీ ఆడటమే తన లక్ష్యమని, ఇన్నాళ్లు ఆటకు దూరమైనా తన బౌలింగ్ ఎలాంటి మార్పు జరగలేదన్నాడు. అదే స్పీడ్, స్వింగ్తో బౌలింగ్ చేయగలనని ధీమా వ్యక్తం చేశాడు. ఇక 37 ఏళ్ల వయసులో శ్రీశాంత్ భారత జట్టుకు ఆడుతానని చెప్పడం చూసి చాలా మంది నవ్వుకున్నారు. కానీ పుదేచ్చేరితో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో అతని స్పెల్ చూసిన తర్వాత ప్రతీ ఒక్కరు అవాక్కయ్యారు. అతను చెప్పింది నిజమేనని, బౌలింగ్లో ఎలాంటి మార్పులేదనే అభిప్రాయానికి వస్తున్నారు.
7 బంతుల్లోనే..
పునరాగమనంలో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న శ్రీశాంత్ 7 బంతుల్లోనే వికెట్ పడగొట్టాడు. అది కూడా అద్భుత స్వింగర్తో బ్యాట్స్మెన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. శ్రీశాంత్ స్వింగ్కు పుదుచ్చేరి బ్యాట్స్మన్ ఫబిద్ అహ్మద్ బిత్తరపోయాడు. శ్రీశాంత్ వేసిన బంతి అహ్మద్ ఆఫ్ స్టంప్ వికెట్ను హిట్ చేసింది. ఈ వికెట్ అనంతరం శ్రీశాంత్ భావోద్వేగానికి గురయ్యాడు. అతని స్పెల్ పూర్తయిన తర్వాత పిచ్కు ధన్యవాదాలు తెలిపాడు. ఇక శ్రీశాంత్ వికెట్కు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
భారత జట్టులోకి కష్టమే..
శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు ఆడి 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్కప్ నెగ్గిన జట్లలో శ్రీశాంత్ సభ్యుడు కావడం విశేషం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీశాంత్ భారత జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే. ఇప్పటికే చాలా యువ ఆటగాళ్లు రేసులో ఉన్నారు. అంతేకాకుండా టీమిండియా రిజర్వ్ బెంచ్ కూడా బలంగానే ఉంది. ఈ క్రమంలో 37 ఏళ్ల శ్రీశాంత్ను భారత జట్టు పరిగణలోకి తీసుకోవడం కష్టమే. అద్భుతాలు జరిగితే తప్పా ఈ కేరళ స్టార్కు అవకాశం దక్కదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications