వచ్చేవాళ్లను వద్దనం.. రానోళ్లను బతిలాడం.. పాక్ బెదిరింపులకు కేంద్ర మంత్రి కౌంటర్!

న్యూఢిల్లీ: ఆసియాకప్ 2023 టోర్నీ కోసం పాకిస్థాన్కు టీమిండియా రాకుంటే తాము భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ను బహిష్కరిస్తామని పీసీబీ చేస్తున్న బెందిరింపులకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గట్టి కౌంటరిచ్చారు. వచ్చేవాళ్లను వద్దనమని, రానోళ్లను బతిలాడమని పాక్ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశం అనంతరం సెక్రటరీ జైషా మాట్లాడుతూ.. పాకిస్థాన్కు భారత్ జట్టు వెళ్లదని, ఆసియాకప్ 2023 టోర్నీని తటస్థ వేదికకు మార్చుతామని తెలిపాడు.
ప్రస్తుతం జై షానే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉండటంతో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆసియాకప్ 2023ని పాకిస్థాన్ నుంచి తరలిస్తే.. ఏసీసీ నుంచి తప్పుకోవడంతో పాటు భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ను బహిష్కరిస్తామని పీసీబీ బెదరింపులకు దిగింది.

బీసీసీఐ చేతిలో లేదు..
ఈ వార్నింగ్పై స్పందించిన భారత కేంద్ర సమాచార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఐసీసీ, బీసీసీఐ అధ్యక్షుడిగా చేసిన ఆయన టీమిండియా పాకిస్థాన్కు వెళ్లేది భారత క్రికెట్ బోర్డు చేతిలో లేదన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 'పాకిస్తాన్ లో భద్రతాపరమైన సమస్యలున్నందున ఆసియా కప్ కోసం టీమిండియా అక్కడకు వెళ్లేదానిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుంది. ఇది కేవలం క్రికెట్ తో ముడిపడి ఉన్న అంశం కాదు.

భారత్ లేకుండా క్రికెటా?
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కూడా పాకిస్తాన్ పర్యటించినట్టుగా చెబుతున్నారు. కానీ ఆ దేశాలను భారత్ తో పోల్చొచ్చా..? మేం పాకిస్థాన్కు వెళ్లాలా..? వద్దా..? అనేది ఎవరో చెబితే వినే పరిస్థితుల్లో లేము. ఇక వన్డే ప్రపంచకప్ కోసం మేం అందరినీ ఆహ్వానిస్తాం. ప్రపంచకప్ ఆడాలనుకునేవాళ్లు రావాలనుకుంటే రావొచ్చు. అసలు భారత జట్టు లేకుండా క్రికెట్ అనే పదానికి అర్థం ఉంటుందా?. ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడల్లో భారత్ భాగమవుతుంది. ముఖ్యంగా క్రికెట్లో భారత్ది కీలక పాత్ర. ఏది ఏమైనా ఆటగాళ్ల భద్రతనే తమకు ముఖ్యం'అని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

పాక్కే తీవ్ర నష్టం..
ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్.. బీసీసీఐతో పాటు ఐసీసీలోనూ పని చేశారు. ప్రస్తుతం ఆయన సోదరుడు అరుణ్ ధుమాల్ బీసీసీఐలో కీలక పదవిలో ఉన్నారు. ఇక ప్రపంచకప్ను పాకిస్థాన్ బాయ్కట్ చేస్తే ఆ దేశానికే తీవ్ర నష్టమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్రికెట్ బోర్డుల్లో బీసీసీఐకి ఉన్న పవర్, మనీ మరే బోర్డుకు లేదని, అన్ని బోర్డులు భారత క్రికెట్ బోర్డుకు దాసోహం అనాల్సిందేనని చెబుతున్నారు. ఐసీసీ కూడా బీసీసీఐ చెప్పినట్లు నడుచుకుంటుందని, ఈ విషయం గ్రహించక మొండిపట్టు మీద ఉంటే పాకిస్థాన్కే తీవ్ర నష్టమని హెచ్చరిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications