కేఎస్జీ జర్నలిస్ట్ టీ20 ప్రీమియర్ లీగ్(జీపీఎల్) టైటిల్ను టీవీ9 సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ(ఎస్జాట్) ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరిగిన ఈ టోర్నీ శనివారం ముగిసింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో టీవీ9 జట్టు 12 పరుగుల తేడాతో ఎన్టీవీ రైజర్స్ను ఓడించి జేపీఎల్ సీజన్-1 ఛాంపియన్గా నిలిచింది.
ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఎన్టీవీ ప్లేయర్ కిరణ్ మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శనతో టీవీ9 విజయంలో కీలక పాత్ర పోషించిన జగదీష్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఫైనల్ మ్యాచ్కు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు, ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, సహాయ కార్యదర్శి బసవరాజు, కౌన్సిలర్ సునిల్ అగర్వాల్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు.

ఈ ఫైనల్ మ్యాచ్ అనంతరం స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ తెలంగాణ (ఎస్జాట్) తరఫున పది మంది దివ్యాంగ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. విజేతగా నిలిచిన టీవీ9తో పాటు స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణను అభినందించారు. ప్రతీ ఏడాది ఈ టోర్నీ నిర్వహించాలని, ఆరంభ మ్యాచ్ జింఖానా, ఫైనల్ మ్యాచ్ ఉప్పల్లో నిర్వహించేలా సహకరిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టోర్నీ స్పాన్సర్స్ త్రుక్ష ఫుడ్స్ ఎండీ భరత్ రెడ్డి, కేఎస్జీ సీఈఓ సంజయ్, లైఫ్స్పాన్ స్పోర్ట్స్ హెడ్ భరణి, స్మయిల్గార్డ్ ఫౌండర్ శరత్, జూపర్ ఎల్ఈడీ సీఈఓ ఒరుసు రమేష్, మెడికవర్ తెలంగాణ హెడ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్త స్కోర్లు:
టీవీ9- 20 ఓవర్లు - 141/7
బ్యాటింగ్:
ఓపెనర్ సాయికిశోర్ - 25 బంతుల్లో 36 రన్స్
ఆల్రౌండర్ సత్య - 33 బంతుల్లో 45 రన్స్
బౌలింగ్:
అశోక్ చౌదరి (2/19)
కిరణ్ (2/22)
ఎన్టీవీ - 20 ఓవర్లు - 129/8
బ్యాటింగ్:
ప్రేమ్చంద్ - 22 బంతుల్లో 18 రన్స్ (రిటైర్డ్ ఔట్)
కిరణ్ - 32 బంతుల్లో 16 రన్స్
బౌలింగ్:
రాము (2/13)
జగదీష్ (2/15)