బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చడంతోనే వెస్టిండీస్తో తొలి టెస్ట్లో సునాయస విజయాన్నందుకున్నామని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. అహ్మదాబాద్ వేదికగా శనివారం ముగిసిన ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో సిరాజ్(4/40, 3/31) ఏడు వికెట్లతో సత్తా చాటాడు. ఈ విజయానంతరం బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన సిరాజ్.. జట్టులో ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకొని ఆడారని తెలిపాడు.
'ఈ మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మేం బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాం. రెండో ఇన్నింగ్స్లో వికెట్ చాలా స్లోగా ఉంది. బంతి బ్యాట్పైకి అస్సలు రాలేదు. అందుకే ఇక్కడ మూడు వికెట్లు తీసినా.. ఐదు వికెట్లు పడగొట్టిన ఫీలింగ్ కలిగింది. భారత్లో రెండో ఇన్నింగ్స్లో నేను వికెట్ తీయడం ఇదే తొలిసారి అని నాకు నిజంగా తెలియదు. ఇది చాలా ప్రత్యేకమైన అనుభూతి.

మా బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకొని ఆడారు. ఇంగ్లండ్ పర్యట నుంచి కేఎల్ రాహుల్ పరుగులు చేస్తున్నాడు. శుభ్మన్ గిల్ కూడా బాగా ఆడుతున్నాడు. మిగతా బ్యాటర్లు కూడా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేశారు.' సిరాజ్ చెప్పుకొచ్చాడు.
286 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 45.1 ఓవర్లలో 146 పరుగులు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అలిక్ అథనాజే (74 బంతుల్లో 3 ఫోర్లతో 38), జస్టిన్ గ్రీవ్స్(52 బంతుల్లో 4 ఫోర్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/31) మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా(4/54) నాలుగు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్(2/23)కు రెండు వికెట్లు.. వాషింగ్టన్ సుందర్కు ఒక వికెట్ దక్కింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 128 ఓవర్లలో 448/5 పరుగులకు డిక్లెర్ చేసింది. కేఎల్ రాహుల్(197 బంతుల్లో 12 ఫోర్లతో 100), ధ్రువ్ జురెల్(210 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 125, రవీంద్ర జడేజా(176 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 104 నాటౌట్) సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ శుభ్మన్ గిల్(100 బంతుల్లో 5 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు.