టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనికి భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సాధారణ వ్యక్తుల నుంచి సెలెబ్రిటీల వరకు ధోనీని అభిమానిస్తారు. సౌతిండియా స్టార్ హీరో కార్తీ సైతం ధోనీకి బిగ్ ఫ్యాన్. ఏకంగా ధోనీ పేరునే అతను తన చేతిపై టాటూ వేయించుకున్నాడు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ టూటు ఫోటోలను చూసి ధోనీ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో ధోనీకి విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రానికి చెందిన ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్కు ధోనీ సుదీర్ఘ కాలంగా ఆడుతుండటం.. కెప్టెన్గా ఐదు టైటిళ్లు అందించడంతో ధోనీ తాల అంటూ అక్కడి ప్రజలు ఆరాధిస్తారు.

ధోనీ ఆటను చూసేందుకు రాష్ట్రాలు ధాటి మ్యాచ్లకు వస్తుంటారు. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకే కార్తీ.. తన చేతిపై ధోనీ టాటూ వేయించుకున్నట్లు తెలుస్తోంది. తన అప్కమింగ్ మూవీ 'మెయ్యళగన్'లో కార్తీ.. ధోనీ వీరాభిమానిలా లీడ్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
నటుడిగా కార్తీకి ఇది 27వ సినిమా. ఈ మూవీని '96'తో తమిళనాట భారీ విజయాన్ని అందుకున్న సి.ప్రేమ్కుమార్ తెరకెక్కిస్తున్నారు. కార్తీ అన్నా వదనలైన జ్యోతిక, సూర్యలు ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కార్తీ పుట్టినరోజు సందర్భంగా 'మెయ్యళగన్' అనే ఈ సినిమా పేరును, ఫస్ట్లుక్ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అరవింద్స్వామి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

కార్తీ, అరవింద్స్వామి మధ్య ఉన్న స్నేహబంధాన్ని ఈ ఫస్ట్ లుక్ ఆవిష్కరించింది. తమిళ, తెలుగు భాషల్లో ద్విభాష చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు టైటిల్ని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
రాజ్కిరణ్, శ్రీదివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాశ్, శ్రీరంజని, ఇళవరసు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం గోవింద్ వసంత, కెమెరా మహేంద్రన్ జయరాజు, సహనిర్మాతగా రాజశేఖర్ కర్పూర సుందరపాండియన్ వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.