
న్యూఢిల్లీ: కరోనా విలయతాండవం చేస్తున్న క్రమంలో భారత్ నుంచి స్వదేశానికి పయనమైన సౌతాఫ్రికా క్రికెట్ టీమ్..ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. మూడు వన్డేల సిరీస్ కోసం మార్చి నెలలో భారత పర్యటనకు వచ్చిన సఫారీ క్రికెట్ జట్టు.. ఆ ద్వైపాక్షిక సిరీస్ను రద్దు కావడంతో స్వదేశానికి వెనుదిరిగింది.
అయితే భారత పర్యటన తర్వాత ఆ టీమ్ ఆటగాళ్లు 14 రోజులు స్వీయ నిర్బంధానికి వెళ్లారు. ఇక క్వారంటైన్ను పూర్తి చేసుకున్న సఫారీ ప్లేయర్లకు తాజాగా కరోనా టెస్ట్లు నిర్వహించగా.. నెగటీవ్ వచ్చింది. దీంతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ విషయాన్ని బోర్డు వర్గాలే శుక్రవారం వెల్లడించాయి.
విదేశాల నుంచి వచ్చిన నేపథ్యంలో క్రికెటర్లు అందరినీ క్వారంటైన్లో ఉంచింది. రోజువారీగా వారిని పర్యవేక్షించిన బోర్డు మెడికల్ టీమ్.. తాజాగా క్రికెటర్ల ఆరోగ్య పరిస్థితిని తెలిపింది. అందరూ క్రికెటర్లు ఆరోగ్యంగా ఉన్నారని, క్వారంటైన్ సమయంలో కరోనా అనుమానిత లక్షణాలేవి బయటపడలేదని పేర్కొంది. ఇక కరోనా నిర్దారిత పరీక్ష చేసుకున్న వారందరికీ నెగిటివ్ అని తేలిందని తెలిపింది.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా.. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే తుడుచుపెట్టుకుపోయింది. మిగిలిన రెండు వన్డేలు కరోనా కారణంగా రద్దయ్యాయి. అయితే రెండో వన్డే కోసం లక్నోలోని ఓ హెటళ్లో బసచేసింది. ఆ హోటల్లోనే కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కూడా బస చేయడంతో సఫారీ క్రికెటర్లలో భయం పట్టుకుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్ నుంచి వచ్చిన తమ దేశ క్రికెటర్లను సెల్ఫ్ ఐసోలేషన్(స్వీయ నిర్బంధం)లో ఉండమని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశించింది. ఇప్పుడు వారికి కరోనా సోకలేదని తేలడంతో పెద్ద గండం నుంచి తప్పించుకుంది.