
లక్నో: కెప్టెన్ మిథాలీ రాజ్(104 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్తో 79 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించినా.. ఇతర బ్యాటర్లు దారుణంగా విఫలమవడంతో సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన ఆఖరి వన్డేలోనూ భారత మహిళలు 5 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.3 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ మిథాలీ రాజ్ మినహా.. ఓపెనర్లు ప్రియా పూనియా (18), స్మృతి మంధానా (18), పూనమ్ రౌత్ (10), హేమలత (2), సుష్మ వర్మ (0) దారుణంగా విఫలమయ్యారు. హర్మన్ప్రీత్ కౌర్ (30) పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో నదీన్ క్లర్క్ 3 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. షంగేస్ , సేఖుఖునే రెండేసి వికెట్లు పడగొట్టారు. మరిజన్నేకు ఒక వికెట్ దక్కింది.
అనంతరం సౌతాఫ్రికా మహిళలు 48.2 ఓవర్లలో 5 వికెట్లకు 189 పరుగులు చేసి 10 బంతులు మిగిలుండగానే అలవోక విజయాన్నందుకున్నారు. సఫారీ బ్యాటింగ్లో మిగ్నోన్ డుప్రీజ్ (57), అన్నెక్ బాచ్(58), మరిజన్నే కాప్(36 నాటౌట్) రాణించారు.
భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ 3 వికెట్లు తీయగా.. హేమలత, ప్రత్యూష చెరొక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్కు ముందే ఐదు టీ20ల సిరీస్ను 3-1తో సొంతం చేసుకున్న సఫారీ మహిళలు.. నామమాత్రపు ఆఖరి వన్డేలోనూ అదరగొట్టారు.