లక్నో: సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన భారత మహిళల జట్టు శుభారంభాన్ని అందుకోలేకపోయింది. సౌతాఫ్రికా మహిళలతో స్వదేశంలో జరుగుతున్న 5 వన్డేలు, 3 టీ20ల సిరీస్లను మిథాలీ సేన ఓటమితో ప్రారంభించింది. లక్నో వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టుపై ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 177 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ మిథాలి రాజ్ (85 బంతుల్లో4 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీ సాధించగా.. వైస్ కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ (41 బంతుల్లో 6 ఫోర్లతో 40) రాణించింది. ఈ ఇద్దరూ మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన ఓపెనర్ స్మృతి మంధాన(14) తీవ్రంగా నిరాశపరిచింది. సఫారీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ (3/28) మూడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించింది. ఆమెకు తోడుగా మ్లాబా(2/41), కాప్ (1/25), ఖాకా (1/29), కెప్టెన్ లస్ (1/23)లు రాణించారు.
ఆనంతరం 178 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు.. ఓపెనర్లు లిజెల్ లీ (122 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్తో 83 నాటౌట్ ), వొల్వార్డ్డ్ (110 బంతుల్లో 12 ఫోర్లతో 80) రాణించడంతో 40.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. భారత బౌలర్లలో జులాన్ గోస్వామికి (2/38) రెండు వికెట్లు తీయగా.. ఇతర బౌలర్లు విఫలమయ్యారు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 3 కీలకమైన వికెట్లు తీసుకున్న షబ్నిమ్ ఇస్మాయిల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా (మార్చి 9) మంగళవారం జరుగనుంది.
అయితే పురుష క్రికెటర్ల తరహానే తదుపరి మ్యాచ్ల్లో మిథాలీ సేన చెలరేగుతుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లండ్ చేతిలో ఫస్ట్ టెస్ట్లో ఓడిన భారత్ .. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలతో 3-1తో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.