
షార్జా: టీ20 ప్రపంచకప్లో సౌతాఫ్రికా మరో అద్భుత విజయాన్నందుకుంది. శ్రీలంకతో శనివారం జరిగిన ఉత్కంఠకర మ్యాచ్లో డేవిడ్ మిల్లర్(13 బంతుల్లో 2 సిక్స్లతో 23 నాటౌట్) విధ్వంసంతో నాలుగు వికెట్లతో గెలుపొందింది. శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా హ్యాట్రిక్తో చెలరేగినా ఫలితం లేకపోయింది. ఈ ఓటమితో శ్రీలంక సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(58 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 72)మినహా అంతా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ రెండు వికెట్లు తీయగా.. తబ్రైజ్ షంసీ, ప్రిటోరియస్ మూడేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 19.5 ఓవర్లలోనే 6 వికెట్లకు 146 రన్స్ చేసి ఓ బంతి మిగిలుండగానే విజయాన్నందుకుంది. చివర్లో డేవిడ్ మిల్లర్ ధాటిగా ఆడగా.. అంతకుముందు కెప్టెన్ టెంబా బవుమా(46 బంతుల్లో ఫోర్, సిక్స్తో 46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కగిసో రబడా(7 బంతుల్లో ఫోర్, సిక్స్తో 13 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. లంక బౌలర్లలో హసరంగా మూడు వికెట్లు తీయగా.. చమీరా రెండు వికెట్లు పడగొట్టాడు.
ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 15వ ఓవర్ చివరి బంతికి ఎయిడెన్ మార్క్రమ్(19)ను ఔట్ చేసిన హసరంగా.. తన మరుసటి 18వ ఓవర్లో తొలి రెండు బంతుల్లోనే కెప్టెన్ టెంబా బవుమా(46), ప్రెటోరియస్(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. దాంతో లంక విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఆ ఆశలను రబడా, మిల్లర్ గల్లంతు చేశారు. చమీరా వేసిన 19వ ఓవర్లో రబడా భారీ సిక్సర్ బాదడంతో సఫారీ విజయానికి ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమయ్యాయి. లాహిరు కుమార వేసిన ఈ ఓవర్లో రబడా ఫస్ట్ బాల్ను సింగిల్ తీయగా.. స్ట్రైకింగ్లోకి వచ్చిన మిల్లర్ రెండు భారీ సిక్స్లు బాదాడు. దాంతో సౌతాఫ్రికా విజయానికి చివరి మూడు బంతుల్లో రెండు పరుగులు అవసరయ్యాయి. మిల్లర్ సింగిల్ తీసి టై చేయగా.. రబడా ఫోర్తో మ్యాచ్ను ముగించాడు.