SA vs IND: సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు వరణుడు పరీక్షపెడుతున్నాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా నేడు(ఆదివారం) జరగాల్సిన తొలి మ్యాచ్కు ఆటంకం కలిగిస్తున్నాడు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం డర్బన్ వేదికగా రాత్రి 7.30 గంటలకే ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా ఇంకా మొదలవ్వలేదు.
కనీసం టాస్ కూడా పడలేదు. ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో మైదానాన్ని కవర్లతో కప్పేసారు. కాస్త విరామం ఇచ్చినా ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహించాలని క్రికెట్ సౌతాఫ్రికా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో నిరీక్షిస్తున్నారు. వర్షం తగ్గితే మ్యాచ్ ఆడాలనే ఆతృతతో ఉన్నారు.

ప్రస్తుతం డర్బన్లో వర్షం పడుతోంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవుతుందని క్రికెట్ సౌతాఫ్రికాతో పాటు బీసీసీఐ ట్వీట్ చేసింది. ఏ మాత్రం గడువు ఇచ్చినా ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు సిద్దంగా ఉన్నారు. గ్రౌండ్లో అత్యాధునికమైన డ్రైనేజీ సిస్టమ్ ఉండటం కలిసొచ్చే అంశం.
ప్రపంచకప్ ఓటమి అనంతరం సూర్యకుమార్ కెప్టెన్సీలో టీమిండియా యువ జట్టు ఆస్ట్రేలియాను 4-1 తేడాతో చిత్తుగా ఓడించింది. ఇప్పుడు సౌతాఫ్రికా టీ20 సిరీస్ ను కైవసం చేసుకోవాలని సూర్యసేన పట్టుదలతో ఉంది. అంతేగాక సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ చేరడం జట్టుకు మరింత బలాన్ని ఇస్తుంది.
ఇక సౌతాఫ్రికాతో జరిగిన గత నాలుగు టీ20 సిరీస్ లో టీమిండియా రెండు సార్లు విజేతగా నిలిచింది. మరో రెండు సిరీస్ లు డ్రాగా ముగిశాయి. 2015లో జరిగిన టీ20 సిరీస్ విజయమే టీమిండియాపై దక్షిణాఫ్రికాకు ఆఖరిది. ఆ తర్వాత భారత్ దే పైచేయి.
డర్బన్ లో ఇప్పటివరకు 19 టీ20 మ్యాచ్ లు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు, అలాగే ఛేజింగ్ చేసిన జట్టు కూడా ఎనిమిది సార్లు గెలిచాయి. రెండు మ్యాచ్ ల్లో ఫలితం రాలేదు. 2007లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఈ గణాంకాలతో డర్బన్ లో టాస్ నామమాత్రమే అని చెప్పొచ్చు.
ఇక డర్బన్ పిచ్ విషయానికొస్తే.. గత కొన్నేళ్లు ఇది 'స్లో' గా ఉంది. కానీ ఇటీవల సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 190కి పైగా పరుగులు సాధించడం విశేషం.