
ఇద్దరికి కరోనా
నిజానికి శుక్రవారమే జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ను దక్షిణాఫ్రికా ఆటగాడు కరోనా బారిన పడటంతో ఆదివారానికి వాయిదా వేశారు. ఇక షెడ్యూల్ ప్రకారం ఆదివారం మ్యాచ్ జరుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే రెండు జట్లు బస చేసిన హోటల్లో ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలడంతో.. జట్టు యాజమాన్యాలలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఆ సిబ్బందితో ఇరుజట్ల కాంటాక్ట్ అయ్యాయి. దీంతో శనివారం అందరికీ కరోనా పరీక్షలు చేయించగా.. ఇంగ్లీష్ జట్టులో ఇద్దరు పాజిటివ్గా తేలారు. దీంతో ఏకంగా మ్యాచునే రద్దు చేశారు.

సందిగ్ధంలో సిరీస్
తొలి వన్డే మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతుందని ఉదయం ప్రకటించిన నిర్వాహకులు కొద్దిసేపటి తర్వాత రద్దు నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు, సహాయక సిబ్బంది ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కరోనా పాజిటివ్గా తేలారు. వారు ప్రస్తుతం కోలుకుంటున్నారు. తాజా పరిణామాలతో వన్డే సిరీస్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. మూడు టీ20ల సిరీస్ని ఇంగ్లీష్ జట్టు 3-0తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

ఆటగాళ్ల సంక్షేమం గురించే మా ఆందోళన
'కరోనా పరీక్షల ఫలితాల్ని వైద్య నిపుణులు ధ్రువీకరించిన తర్వాత మిగతా రెండు మ్యాచ్ల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటాం. ఆదివారం నాటి వన్డేలో ఆడలేకపోడానికి చింతిస్తున్నాం. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది సంక్షేమం గురించే మా ఆందోళన. తొలి వన్డే నిర్వహించొద్దని ఇరుజట్ల వైద్య బృందాలు సూచించాయి. ఫలితాల ధ్రువీకరణ కోసం ఎదురుచూస్తున్నాం. క్రికెట్ దక్షిణాఫ్రికాతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఎలా ముందుకు సాగాలో కలిసికట్టుగా నిర్ణయిస్తాం' అని ఇంగ్లండ్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే జైల్స్ చెప్పాడు.
India vs Australia: 'సూపర్' చహల్.. బుమ్రా కంటే వేగంగా సాధించాడు!!


Click it and Unblock the Notifications












