
సిడ్నీ: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డును చహల్ సమం చేశాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ను ఔట్ చేయడం ద్వారా యూజీ ఈ ఘనత సాధించాడు. 18 ఓవర్ ఐదో బంతికి స్మిత్ను పెవిలియన్కు పంపాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో 59వ వికెట్ను చహల్ తన ఖాతాలో వేసుకున్నాడు.
భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో జస్ప్రీత్ బుమ్రాతో కలిసి యుజ్వేంద్ర చహల్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఈ ఫీట్ను బుమ్రా కంటే వేగంగా చహల్ సాధించడం విశేషం. బుమ్రా ఇప్పటివరకూ 49 మ్యాచ్లు ఆడి 59 వికెట్లు సాధించగా.. చహల్ 44 మ్యాచ్ల్లో 59 వికెట్లను పడగొట్టాడు. దాంతో బుమ్రా కంటే వేగంగానే చహల్ 59వ అంతర్జాతీయ టీ20 వికెట్ మార్కును చేరాడు. ఆసీస్తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో రవీంద్ర జడేజా స్థానంలో కాంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన చహల్.. 3 వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పిన సంగతి తెలిసిందే.
తొలి మ్యాచ్లో తొలుత యుజ్వేంద్ర చహల్ తుది జట్టు (ప్లేయింగ్ 11)లో లేడు. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన రవీంద్ర జడేజాకు చివరి ఓవర్లో తలకు గాయమవడంతో చహల్ కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చాడు. దీంతో రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసిన చహల్.. ఆరోన్ ఫించ్ (35), స్టీవ్ స్మిత్ (12), మాథ్యూ వేడ్ (7)లను ఔట్ చేశాడు. తన కోటా 4 ఓవర్లో 25 రన్స్ ఇచ్చి అద్భుత ప్రదర్శన చేసిన చహల్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన తొలి క్రికెటర్ చహల్ కావడం విశేషం. ఇక రెండో మ్యాచ్లో 4 ఓవర్లలో 51 పరుగులు సమర్పించుకున్నా.. కీలకమైన స్మిత్ వికెట్ తీశాడు.
ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. మాథ్యూ వెడ్ (32 బంతుల్లో 58; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో అలరించగా.. స్టీవ్ స్మిత్ (38 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (36 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలుండగానే కోహ్లీసేన సిరీస్ కైవసం చేసుకుంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆఖరి మ్యాచ్ సిడ్నీ వేదికగానే మంగళవారం జరగనుంది.