
జోహన్నెస్బర్గ్: కరోనా వైరస్ కారణంగా మరో క్రికెట్ టూర్ వాయిదా పడింది. ఈ మహమ్మారి నియంత్రణలోకి రాకపోవడంతో శ్రీలంక పర్యటనను వాయిదా వేస్తున్నామని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం ఈ జూన్లో ఇరు దేశాల మధ్య మూడేసి వన్డేలు, టి20 మ్యాచ్లు జరగాల్సి ఉంది.
ఈ వన్డే సిరీస్తోనే ఐసీసీ కొత్త వన్డే లీగ్ను ఆరంభించనుంది. మార్చి 2022 వరకు ఐసీసీ నిర్వహించనున్న ఈ వన్డే లీగ్ ఆధారంగా 2023 ప్రపంచకప్కు జట్లను ఎంపిక చేస్తారు. కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ సిరీస్లను వాయిదా వేశారు.
'ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో మా ఆటగాళ్లు సిరీస్కు సన్నద్ధంగా లేరు. పైగా అన్నింటికి మించి ఆటగాళ్ల ఆరోగ్యం ప్రధానమైంది. వాయిదా వేయాలనే నిర్ణయం భారమైనా... తప్పలేదు. మళ్లీ క్రికెట్ మొదలయ్యాక భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)లోని వెసులుబాటును బట్టి ఈ ద్వైపాక్షిక సిరీస్ను రీషెడ్యూల్ చేసుకుంటాం'అని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్వెస్ ఫాల్ తెలిపారు.
ఇటీవల స్వదేశంలో ఆసీస్పై తమ ఆటగాళ్లు చక్కని ప్రదర్శన చేశారని అన్నారు. అదే ఫామ్ను కొనసాగిద్దామని తమ ఆటగాళ్లు భావించారని, కానీ ప్రస్తుత పరిస్థితులతో నిరాశకు గురవుతున్నారని వెల్లడించారు.