
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్ల కారణంగా యూఏఈ పిచ్లు జీవం కోల్పోతాయని సౌతాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బౌచర్ అన్నాడు. కరోనా కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ మ్యాచ్లను సెప్టెంబర్-అక్టోబర్ మధ్య యూఏఈ వేదికగా నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్దమవుతోంది. మరోవైపు ఈ మెగా లీగ్ పూర్తైన వెంటనే భారత్ వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ను కూడా అక్కడే నిర్వహిస్తామని పేర్కొంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఐసీసీకి తెలియజేసిన బీసీసీఐ.. ఐపీఎల్ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ప్రపంచకప్ ముందు జరిగే ఐపీఎల్ మ్యాచ్లతో యూఏఈ పిచ్లు దెబ్బతింటాయని మార్క్ బౌచర్ ఆందోళన వ్యక్తం చేశాడు. బ్యాట్స్మెన్కు పరుగులు చేయడం ఇబ్బందిగా మారి స్పిన్నర్లకు కలిసివస్తుందని అతడు అభిప్రాయపడ్డాడు.
'ఐపీఎల్ తర్వాత యూఏఈలోని పిచ్లు తేమ కోల్పోయి పొడిగా తయారవుతాయి. దాంతో సౌతాఫ్రికా మాదిరి అక్కడ బ్యాటింగ్ చేసి 180 లేదా 200 పరుగులు చేసే వీలుండదు. అలాంటి పరిస్థితుల్లో ఆడాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. చాలా తెలివిగా ఆడాలి. బీసీసీఐ ఐపీఎల్ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది. అక్కడ మైదానాలు ఎక్కువగా లేవు. దాంతో పిచ్లు దెబ్బతిని పనికిరాకుండా పోతాయి. ఈ క్రమంలోనే స్కోర్లు కూడా తక్కువగా నమోదవుతాయి. అప్పుడు బ్యాట్స్మెన్కు పరిస్థితులు కష్టంగా మారుతాయి' అని బౌచర్ వివరించాడు.
అలాగే ఐపీఎల్లో ఎలాంటి స్కోర్లు నమోదవుతాయో ఆ మ్యాచ్లను చూసి అంచనా వేయొచ్చని, ఆపై ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లను చూసి పిచ్లు ఎలా ప్రవర్తిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చని అతడు చెప్పుకొచ్చాడు. చివరగా పొట్టి ప్రపంచకప్లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషిస్తారని బౌచర్ జోస్యం చెప్పాడు. ఇక ఈ సమస్యను అధిగమించేందుకే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మ్యాచ్లను ఓమన్ వేదికగా నిర్వహించేలా ఐసీసీని బీసీసీఐ ఒప్పించింది. దాంతో ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ మధ్య రెండు వారాల గ్యాప్ రానుంది. పిచ్లు మళ్లీ పూర్వ వైభవం అందుకోవడానికి ఈ టైమ్ సరిపోతుందనేది విశ్లేషకుల మాట.