వన్డే క్రికెట్ చరిత్రలోనే సౌతాఫ్రికా అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 54 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత దారుణంగా ఓడిన జట్టుగా సౌతాఫ్రికా చెత్త రికార్డును నమోదు చేసింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో సౌతాఫ్రికా 342 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. వన్డేల్లో పరుగుల పరంగా ఇంత భారీ తేడాతో ఓడిన జట్టు సౌతాఫ్రికా మాత్రమే. ఈ మ్యాచ్లో ఓడినా ఈ సిరీస్ను సౌతాఫ్రికా 2-1తో కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లో అసాధారణ ప్రదర్శనతో విజయాన్నందుకొని ఇంగ్లండ్ గడ్డపై 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ గెలుచుకుంది. అలాంటి ఆఖరి వన్డేలో 72 పరుగులకే ఆలౌటైంది.
ఈ పరాజయంపై సౌతాఫ్రికా హెడ్ కోచ్ శుక్రి కాన్రాడ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తొలి రెండు వన్డేల్లో గెలిచి ఆఖరి మ్యాచ్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవడం అత్యంత దారుణమని అసహనం వ్యక్తం చేశాడు. సిరీస్ గెలిచామనే ఉదాసీనతే తమ ఘోర ఓటమికి కారణమని చెప్పుకొచ్చాడు.

'ఈ ఘోర పరాజయానికి ఎలాంటి సాకులు లేవు. ఈ రోజు మేము బాగా ఆడలేదు. ఇంగ్లండ్ వంటి టాప్ టీమ్తో ఆడేటప్పుడు సరిగ్గా ఆడకపోతే మన బలహీనతలు బయటపడుతాయి. ఆస్ట్రేలియాలో కూడా ఇలాగే జరిగింది. అక్కడ కూడా సిరీస్ను 2-0తో గెచుకున్న తర్వాత ఆఖరి వన్డేలో 400 పరుగులకు పైగా సమర్పించుకున్నాం.
ఇలాంటి మ్యాచ్ల్లో మేము పేలవ ప్రదర్శన చేస్తున్నాం. ఇది ఏమాత్రం అమోదయోగ్యం కాదు. ఈ ఓటమి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. బహుశా మా ఆగాళ్లు సిరీస్ గెలిచామనే ఉదాసీనతో ఆడినట్లున్నారు. ఫీల్డింగ్ కూడా మా స్థాయికి తగ్గట్లు లేదు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్పై ఫోకస్ పెట్టాం. టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహకాలను ఈ సిరీస్ నుంచి ప్రారంభిస్తాం. ఈ వన్డే సిరీస్లో ఘోర పరాజయం ఎదురైనా.. మాకు అనేక సానుకూలంశాలు ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్ల్లో అనుభవం లేని ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేశారు.'అని శుక్రి కాన్రాడ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 414 పరుగులు చేసింది. జోరూట్(100), జాకోబ్ బెతెల్(110) శతకాలతో రాణించారు. అనంతరం సౌతాఫ్రికా 72 పరుగులకే ఆలౌటైంది. జోఫ్రా ఆర్చర్(4/18), ఆదిల్ రషీద్(31/3) సఫారీ పతనాన్ని శాసించారు. బ్రైడన్ కార్స్(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు.