టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ ఆష్వెల్ ప్రిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. హార్దిక్ పాండ్యా సిక్సర్ల రారాజు అని, ఏ బంతిని ఆడాలనే విషయంలో మంచి అనుభవం ఉందని కొనియాడాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం కటక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 101 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.
176 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 74 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా(28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. బౌలింగ్లోనూ ఒక వికెట్ తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ అద్భుత బ్యాటింగ్తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు.

ఈ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ ఆష్వెల్ ప్రిన్స్.. హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతోనే తమ జట్టు ఓటమిపాలైందన్నాడు. 'హార్దిక్ పాండ్యా సిక్సర్ల రారాజు. అతను సిక్సర్లు కొట్టడమే కాదు. ఏ బంతిని కొట్టాలో.. ఏ బంతిని వదిలేయాలో కచ్చితంగా అంచనా వేయగల సామర్థ్యం, పరిణితి అతనికి ఉంది. ఇది సుదీర్ఘ అనుభవంతో మాత్రమే వస్తుంది. బంతి అతని యార్క్లో పడితే ఎలాంటి సంకోచం లేకుండా బౌండరీకి తరలిస్తాడు. చాలా క్లారిటీతో బ్యాటింగ్ చేస్తాడు. అతని ఇన్నింగ్స్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అతను షాట్ ఆడే విధానం అద్భుతంగా ఉంటుంది.'అని ఆష్వెల్ ప్రిన్స్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(3/31) మూడు వికెట్లు తీయగా.. లుతో సిపమ్లా(2/38) రెండు వికెట్లు పడగొట్టాడు. డోనోవన్ ఫెర్రెరియా ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం సౌతాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. డెవాల్డ్ బ్రెవిస్(14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగతా బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(2/14), జస్ప్రీత్ బుమ్రా(2/17), వరుణ్ చక్రవర్తీ(2/19), అక్షర్ పటేల్(2/7) రెండేసి వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే చెరో వికెట్ తీసారు.