న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్కు ఏబీ డివిలియర్స్ను తీసుకుంటామని సౌతాఫ్రికా కెప్టెన్ క్వింటన్ డికాక్ స్పష్టం చేశాడు. దీంతో ఏబీ రీఎంట్రీ పై సందిగ్ధత వీడింది. 2018లో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మిస్టర్ 360.. వన్డే ప్రపంచకప్ ఆడేందుకు ఆసక్తికనబర్చాడు. కానీ అప్పటికే టీమ్ ప్రిపేరేషన్స్ స్టార్ట్ అవ్వడంతో అతని విన్నపాన్ని పట్టించుకోని సౌతాఫ్రికా టీమ్మేనేజ్మెంట్.. అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది.
ఇక ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్లోనైనా ఆడించాలనుకుంది. అయితే కరోనా పుణ్యమా ఈ మెగాటోర్నీ వాయిదాపడిన విషయం తెలిసిందే. అయితే టీ20 ప్రపంచకప్ ఎప్పుడు జరిగినా.. డివిలియర్స్ ఫిట్గా ఉంటే జట్టులోకి తీసుకుంటామని డికాక్ తెలిపాడు.
'టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికలో డివిలియర్స్ మా ప్రతిపాదనల్లో ఉంటాడు. అతడు ఫిట్గా ఉంటే కచ్చితంగా తీసుకుంటాం. ఏ జట్టయినా డివిలియర్స్ లాంటి ఆటగాడిని తీసుకోడానికి ఇష్టపడుతుంది. టీ20 ప్రపంచకప్ ఎప్పుడు జరగుతుందో వేచి చూడాలి' అని క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో పాల్గొన్న డికాక్ వెల్లడించాడు.
ఈ ఏడాది జనవరిలోనే దక్షిణాఫ్రికా క్రికెట్ అసోసియేషన్ డుప్లెసిస్ను తొలగించి డికాక్ను టీ20 జట్టు కెప్టెన్గా ఎన్నుకుంది. ఆ దేశ క్రికెట్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ను టెస్ట్ కెప్టెన్సీకి ఎన్నుకోలేమని ఏప్రిల్లో ప్రకటించాడు. అధిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని టెస్టు సారథిగా ఉండేందుకు డికాక్ సైతం సుముఖత చూపలేదు. వికెట్ కీపర్గా ఉంటూ, ఓపెనింగ్ చేస్తూ మూడు జట్లకు కెప్టెన్సీ వహించడం తీవ్ర ఒత్తిడితో కూడుకున్న పని అన్నాడు. మూడు జట్లను నడపడం నావల్ల కాదన్నాడు. కేవలం టీ20, వన్డేలకే కెప్టెన్సీ వహిస్తే నేను చాలా సంతోషంగా ఉంటానని తెలిపాడు.
బౌలింగ్ చేసి బౌండరీ ఆపడమా.. స్టోక్స్ నీ కమిట్మెంట్కు సలాం!