భారత క్రికెట్లో అత్యంతగా బాధపెట్టే సందర్భం ఏదైనా ఉందా? అంటే అది 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమి. న్యూజిలాండ్తో జరిగిన ఆ మ్యాచ్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ టోర్నీ అసాధారణ ప్రదర్శనతో సెమీఫైనల్ చేరిన టీమిండియా.. తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్లో మాత్రం దారుణంగా విఫలమైంది.
వర్షం కారణంగా రెండు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. అనంతరం లక్స్యచేధనకు దిగిన భారత్.. మ్యాట్ హెన్రీ ధాటికి 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. కానీ భారీ షాట్స్ ఆడే క్రమంలో ఇద్దరూ ఔటయ్యారు. దాంతో భారత్ 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా ఓటమి అంచున నిలిచింది.

ఈ పరిస్థితుల్లో రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ అసాధారణ బ్యాటింగ్తో టీమిండియా శిబిరంలో ఆశలు రేకెత్తించారు. ఓవైపు జడేజా దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ స్లోగా బ్యాటింగ్ చేశాడు. ఓవైపు చేయాల్సిన రన్ రేట్ పెరుగుతున్నా ధోనీ సింగిల్స్కే పరిమితమయ్యాడు. దాంతో ఒత్తిడికి గురైన రవీంద్ర జడేజా భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
12 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లోనే ధోనీ సింగిల్స్కే పరిమితమవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 49వ ఓవర్ తొలి బంతిని సిక్సర్గా తరలించిన ధోనీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్ మూడో బంతికి క్విక్ డబుల్ తీసే క్రమంలో రనౌటయ్యాడు. దాంతో టీమిండియా 221 పరుగులకే కుప్పకూలి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన సౌరవ్ గంగూలీ.. ధోనీ వ్యూహాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. అసలు ధోనీ ఏం చేస్తున్నాడో తనకు అర్థం కావడం లేదన్నాడు. మాటలు రావడం లేదని తన వ్యాఖ్యానంలో చెప్పుకొచ్చాడు. అతని జిడ్డు బ్యాటింగ్ కారణంగానే ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైందని చెప్పుకొచ్చాడు. ధాటిగా ఆడాల్సిన స్థితిలో సింగిల్స్ తీయడం ఏంటని అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.
ధోనీ రనౌట్ కాకుంటే మ్యాచ్ గెలిపించేవాడని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అప్పటికే భారత్ 10 బంతుల్లో24 పరుగులు చేయాలి. ధోనీ ఔటవ్వకపోయి ఉంటే... ఫలితం భారత్కు అనుకూలంగా ఉండేది. చివరి 10 బంతుల్లో మూడు సిక్స్లు బాదినా టీమిండియా సునాయసంగా గెలిచేది.