సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక సలహా ఇచ్చాడు. టీమిండియా మాజీ స్పిన్నర్ మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. స్పిన్ పిచ్లను పక్కనపెట్టి సమతూకమైన వికెట్లపై ఆడాలని తెలిపాడు. స్పిన్నర్లతో కలిసి షమీ జట్టుకు విజయాలు అందిస్తాడని చెప్పాడు.
రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్కు పూర్తిగా స్పిన్కు అనుకూలంగా ఉన్న వికెట్ను గంభీర్ తయారు చేయించగా భారత బ్యాటర్లు తడబడ్డారు. గింగిరాలు తిరిగిన బంతిని ఆడలేక ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.

తాజాగా ఈ పరాజయం స్పందించిన గంగూలీ.. టీమిండియా తమ ప్రణాళికలను మార్చుకోవాలని సూచించాడు. 'గౌతమ్ గంభీర్ అంటే నాకు చాలా ఇష్టం. 2011 వన్డే ప్రపంచకప్తో పాటు 2007 టీ20 ప్రపంచకప్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. టీమిండియా హెడ్ కోచ్గా అతను ఇంకొన్నాళ్లు కొనసాగుతాడు. అయితే గంభీర్ టెస్ట్ మ్యాచ్ల కోసం మంచి పిచ్లు ఎంచుకోవాలి. టెస్ట్ జట్టులోకి మహమ్మద్ షమీని తీసుకోవాలి.
భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీలపై గంభీర్ నమ్మకం ఉంచాలి. స్పిన్నర్లు, పేసర్లు కలిసి మ్యాచ్లు గెలిపిస్తారు. సమతూకమైన వికెట్లపై ఆడాలి. గంభీర్ ఈ విధంగా ఆలోచిస్తాడని ఆశిస్తున్నా. భారత బ్యాటర్లు 350-400 పరుగులు చేయకపోతే మ్యాచ్లు గెలవలేరు. ఇంగ్లండ్ పర్యటనలో భారత బ్యాటర్లు రాణించడంతోనే రెండు మ్యాచ్ గెలిచారు. గంభీర్ మంచి పిచ్లను ఎంచుకొని ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలి. అంతేకాకుండా టెస్ట్లను ఐదు రోజుల్లో గెలవాలి కానీ మూడు రోజుల్లో కాదు'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
2023లో ఆఖరి మ్యాచ్ ఆడిన మహమ్మద్ షమీ.. ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఫిట్నెస్ సాధించినా ఇంగ్లండ్ పర్యటనతో పాటు వెస్టిండీస్, సౌతాఫ్రికాతో టెస్ట్ల సిరీస్లకు షమీని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఫిట్నెస్ సమస్యలు ఉండటంతోనే షమీని పరిగణలోకి తీసుకోలేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. కానీ షమీ రంజీ ట్రోఫీలో 4 మ్యాచ్లు ఆడి 17 వికెట్లు పడగొట్టాడు.