కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఫలితం నెగెటివ్గా వచ్చింది. తన సోదరుడు, బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) కార్యదర్శి స్నేహశీష్ గంగూలీకి పాజిటివ్గా తేలడంతో.. ముందు జాగ్రత్తగా సౌరవ్ కూడా వారంపైగా హోం క్వారంటైన్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి కూడా ఉండడంతో ముందు జాగ్రత్తగా అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే, తాజాగా చేసిన పరీక్షలో అతని శాంపిల్ నెగెటివ్గా తేలిందని గంగూలీ సన్నిహితులు వెల్లడించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న స్నేహశీష్, త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని కూడా వారు తెలిపారు. హాస్పిటల్ నుంచే క్యాబ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాడని, వర్చువల్ మీటింగ్స్లో పాల్గొంటున్నాడన్నారు.
ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న గంగూలీకి కరోనా టెస్ట్లో నెగటీవ్ రావడంతో సోమవారం నుంచి బీసీసీఐ కార్యకలపాల్లో చురుకుగా పాల్గొననున్నాడు. ముఖ్యంగా బీసీసీఐ బిగ్ టాస్క్ ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహణ పనుల్లో నిమగ్నం కానున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు- నవంబరులో జరగాల్సిన టీ20 వరల్డ్కప్ వాయిదాపడటంతో.. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినవిషయం తెలిసిందే. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఐపీఎల్ను ఈ ఏడాది భారత్లో కాకుండా యూఏఈలో బీసీసీఐ ప్లాన్ చేసింది.
యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరిన బీసీసీఐ.. గవర్నమెంట్ నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో టోర్నీ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అలానే టోర్నీకి నెల రోజుల ముందే అంటే.. ఆగస్టు 20 నాటికి ఐపీఎల్లో ఆడే క్రికెటర్లందరూ యూఏఈకి చేరుకోవాలని కూడా ఇప్పటికే ఫ్రాంఛైజీలకి బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 51 రోజుల ఈ విండోలో మొత్తం 60 మ్యాచ్లు జరగనుండగా.. డబుల్ హెడర్ మ్యాచ్లు ఐదు ఉండే అవకాశం ఉంది.
ఐపీఎల్... దేశ ప్రజల మూడ్ను మార్చుతుంది: గంభీర్