న్యూఢిల్లీ: టీమిండియా సెలెక్టర్లపై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర పాటు జట్టుకు దూరమైన అజింక్యా రహానేను భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్గా ఎందుకు నియమించారో తనకు అర్థం కావట్లేదన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రాణించినంత మాత్రానా అతనికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
వెస్టిండీస్ పర్యటనలోని రెండు టెస్ట్ల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చతేశ్వర్ పుజారాపై వేటువేసిన సెలెక్టర్లు రహానేకు ఆ బాధ్యతలు అప్పగించారు. టీమ్ ఎంపికపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వగా.. గంగూలీ కూడా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. జట్టులో స్థిరంగా రాణిస్తున్న రవీంద్ర జడేజా, శుభ్మన్ గిల్ వంటి ఆటగాళ్లకు వైస్ కెప్టెన్సీ ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు.

'టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్గా రహానేను ఎంపిక చేయడం సరికాదు. నేనెప్పుడూ ఇలాంటి సెలెక్షన్ చూడలేదు. 18 నెలలుగా జట్టుకు దూరమై,రీఎంట్రీలో ఒక్క మ్యాచ్ ఆడిన ఆటగాడికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడంలో సెలక్టర్ల ఉద్దేశం అర్థం కావట్లేదు. జట్టులో రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు. వైస్ కెప్టెన్సీకి అతడు అర్హుడే. ఎక్కడ ఆడినా అతను ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఎంచుకుంటే టీమ్కు మంచి జరుగుతుంది. కనీసం శుభ్మన్ గిల్ను పరిశీలించిన బాగుండేది. సెలక్షన్లో నిలకడకు ప్రాధాన్యత ఉండాలి.

ఇక చతేశ్వర్ పుజారాను జట్టులో కొనసాగిస్తారా? లేదా అతని స్థానంలో యువ ఆటగాడిని సిద్దం చేస్తారా? అన్న దానిపై కూడా సెలెక్టర్లు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పుజారా లాంటి ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఓ సిరీస్కు ఎంపిక చేసి మరో సిరీస్కు పక్కనబెట్టడం సరైంది కాదు. రహానే విషయంలోనూ నిలకడ పాటించాలి. సీనియర్ ఆటగాళ్ల విషయంలో సెలెక్టర్లు స్పష్టమైన అభిప్రాయంతో ముందుకు సాగాలి.
సర్ఫరాజ్ఖాన్ను ఎందుకు ఎంపిక చేయలేదో కూడా సెలెక్టర్లు వివరణ ఇవ్వాలి. రంజీ, ఇరానీ, దులీప్ ట్రోఫీల్లో టన్నుల కొద్దీ రన్స్ చేసిన యశస్వికి అవకాశం ఇవ్వడం బాగుంది. కానీ సర్ఫరాజ్ కూడా పరుగులు చేసాడనే విషయం మరిచిపోతే ఎలా? గత మూడేళ్లుగా అతను దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. అభిమన్యు ఈశ్వరన్కు కూడా అన్యాయమే జరిగింది.
కనీసం భవిష్యత్తులోనైనా ఈ ఇద్దరికి అవకాశం ఇవ్వాలి. ఐపీఎల్ ముగిసిన వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం వల్ల జట్టుకు ఎలాంటి నష్టం జరగలేదు. ఆటగాళ్ల వర్క్లోడ్మేనేజ్మెంట్పై మాత్రం ఫోకస్ పెట్టాలి. ఐపీఎల్లో ఆడిన ప్లేయర్లు డబ్ల్యూటీసీ ఫైనల్లో రాణించారు.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.