
బిన్నీనే తదుపరి అధ్యక్షుడు..
1983 ప్రపంచకప్ విన్నర్ రోజర్ బిన్నీ బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ దాఖలు చేయగా.. ఉపాధ్యక్ష పదవికి రాజీవ్ శుక్లా పోటీపడుతున్నాడు. అధ్యక్ష పదవికి బిన్నీ నామినేషన్ దాఖలు చేశాడని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపాడు. 'బీసీసీఐ 36వ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ నామినేషన్ దాఖలు చేశాడు.
బిన్నీతో పాటు జై షా, అశిష్ షెలార్, దేవజిత్ సైకియా లు నామినేషన్లు దాఖలు చేశారు. అరుణ్ ధుమాల్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (పాలకమండలి) హెడ్ గా ఉండనున్నాడు. అభిషేక్ ధాల్మియా (జగ్మోహన్ ధాల్మియా కొడుకు) ఐపీఎల్ పాలకమండలి సభ్యుడిగా, ఖైరుల్ జమల్ మజుందార్ అపెక్స్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉండనున్నారు...' అని తెలిపాడు.

బీజేపీ రాజకీయాలకు..
కెప్టెన్ గా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) లో కీలక పదవులు అనుభవించిన దాదా ఆ తర్వాత తన పలుకుబడితో ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డులో చక్రం తిప్పాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఒక పర్యాయం అధికారాన్ని అనుభవించిన దాదా.. రెండో దఫా కూడా తిరిగివస్తాడని అంతా భావిస్తుంటే గంగూలీకి ఊహించని షాక్ తగిలింది.
బెంగాల్లో గంగూలీనీ కలుపుకుని అధికారం చేజిక్కించుకోవాలని చూసిన బీజేపికి అతను సహకరించలేదు. 'నాకు రాజకీయాలు ఆసక్తి లేదు' అని పదేపదే చెప్పిన దాదా..చివరకు ఆ పార్టీ రాజకీయాలకే బలయ్యాడనే చర్చ జోరుగా సాగుతోంది. తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

జై షా వెన్ను పోటు..
ఇక దాదాను తప్పించడంలో బోర్డు సెక్రటరీ జై షా పాత్ర ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. బోర్డు సాధించిన ఘనతలను తన క్రెడిట్గా చెప్పుకున్న జై షా.. వైఫల్యాలకు దాదా కారణమని బోర్డు సభ్యులను నమ్మించడంలో సఫలమయ్యాడు. కరోనా సమయంలో బయో బబుల్స్తో మూడు ఐపీఎల్ సీజన్లు నిర్వహించడం.. ప్రపంచకప్ టోర్నీని సక్సెస్ చేయడం వంటి ఘనతలతో పాటు ఐపీఎల్ మీడియా రైట్స్ను భారీ ధరకు అమ్మడంలో తనదే కీలక పాత్ర అని జై షా క్రెడిట్ కొట్టేసాడని గంగూలీ సన్నిహితుల వాదన.
ఇక టీ20 ప్రపంచకప్లో భారత జట్టు వైఫల్యానికి దాదానే కారణమని, జట్టు సెలెక్షన్లో అతని అతి జోక్యమే కొంపముంచిందని బోర్డు సభ్యులను నమ్మించాడు.

కోహ్లీతో గొడవ..
ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో దాదాకు ఉన్న బేధాభిప్రాయాలు కూడా అతన్ని తప్పించడానికి ప్రధాన కారణమయ్యాయి. కెప్టెన్సీ నుంచి తప్పించే విషయంలో దాదా చేసిన వ్యాఖ్యలు, దానికి కోహ్లీ కౌంటరివ్వడం బోర్డు ప్రతిష్టను దిగజార్చాయి. ఈ ఘటనలనే ఎత్తి చూపుతూ బోర్డు సభ్యులు దాదాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రపంచకప్ జట్టుకు టీమ్ మెంటార్గా ధోనీని ఎంపిక చేయడం, రవి శాస్త్రితో ఉన్న బేధాభిప్రాయాల నేపథ్యంలో దాదా జట్టు సెలెక్షన్లో జోక్యం చేసుకోవడం వంటివి బోర్డు సభ్యులకు నచ్చలేదని తెలుస్తోంది.

ఐసీసీ అధ్యక్ష పదవి కూడా..
అయితే బీసీసీఐ అధ్యక్ష పదవి దక్కకున్నా ఈ ఏడాది నవంబర్ లో జరిగే ఐసీసీ అధ్యక్ష రేసులో నిలుద్దామనుకున్న దాదాకు నిరాశే ఎదురైంది. 'ఐసీసీ లేదు గీసీసీ లేదు. ఐపీఎల్ చైర్మెన్ గా ఉంటే ఉండు లేదంటే కోల్కతాకు వెళ్లు..' అని బోర్డు అధికారులు కరాఖండీగా చెప్పినట్టు తెలుస్తున్నది. దీంతో క్రికెట్ లో అత్యున్నత పదవి చేపట్టాలనే ఆశ తీరకుండానే బెంగాల్ టైగర్ తప్పుకుంటున్నాడని అతడి అభిమానులు వాపోతున్నారు. దాదాకు బీసీసీఐ చైర్మెన్ గిరితో పాటు ఐసీసీ ఆశలు గల్లంతవడానికి కారణం జై షానే అని గంగూలీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












