టాపార్డర్ వైఫల్యంతోనే ఇంగ్లండ్తో మూడో టెస్ట్లో టీమిండియా ఓటమిపాలైందని మాజీ కెప్టెన్ సౌరవ్ గూంగూలీ అన్నాడు. రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన కనబర్చినప్పుడు టాపార్డర్కు ఏమైందని ప్రశ్నించాడు. ఒక్క బ్యాటర్ మెరుగ్గా రాణించినా ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. భారత బ్యాటర్ల వైఫల్యం తీవ్ర నిరాశకు గురి చేసిందని అసహనం వ్యక్తం చేశాడు.
ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టెయిలెండర్స్ సాయంతో ఆఖరి వరకు రవీంద్ర జడేజా చేసిన పోరాటం వృథా అయ్యింది. ఓ దశలో భారత్ గెలిచేలా కనిపించింది. కానీ హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ చివరి వికెట్గా వెనుదిరగడంతో భారత ఓటమి లాంఛనమైంది. షోయబ్ బషీర్ వేసిన బంతి సిరాజ్ బాగానే డిఫెన్స్ చేసినా.. నెమ్మదిగా వెళ్లి వికెట్లను తాకింది. దాంతో భారత్కు ఓటమి తప్పలేదు.
ఈ మ్యాచ్లో భారత్ ఓడినా.. రవీంద్ర జడేజా పోరాటం ఆకట్టుకుంది. దాంతో అందరూ అతనిపై ప్రశంసల జల్లు కురిపించారు. టీమిండియా ఓడినా బాధగా లేదని పోస్ట్లు పెట్టారు. అయితే జడేజా పోరాటం బాగానే ఉన్నా.. టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లకు ఏమైందని సౌరవ్ గంగూలీ ప్రశ్నించాడు.

'భారత ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సిరీస్లో భారత్ బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే.. ఈ 193 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధించాల్సింది. జడేజా ఒంటరి పోరాటం చూసి భారత బ్యాటర్లు కచ్చితంగా నిరాశకు గురై ఉంటారు. ఎందుకంటే ఈ సిరీస్లో 2-1తో ఇంగ్లండ్పై ఆధిక్యం సాధించేందుకు ఇదో సువర్ణవకాశం. ముఖ్యంగా తమ సామర్థ్యానికి తగ్గట్లు ఆడలేదనే విషయాన్ని గ్రహించి భారత ఆటగాళ్లు మరింత బాధపడి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. టాపార్డర్ బ్యాటర్లలో ఒక్కరు రాణించినా ఈ మ్యాచ్లో భారత్ గెలిచేది.
జడేజా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. అతను ఇలా బ్యాటింగ్ చేస్తున్నంత కాలం తన కెరీర్ను కొనసాగిస్తాడు. అతను చాలా కాలంగా జట్టులో ఉన్నాడు. దాదాపు 80 టెస్ట్లు, 200కి పైగా వన్డేలు ఆడాడు. అతని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జడేజా ఒక ప్రత్యేకమైన ఆటగాడు. గత కొన్నేళ్లుగా అతని బ్యాటింగ్ ఎంతో మెరుగైంది. ఎంతో అనుభవం కలిగిన జడేజా.. జట్టులో కీలకంగా మారాడు.'అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. 193 పరుగుల లక్ష్యచేధనకు దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా(61 నాటౌట్), కేఎల్ రాహుల్(39) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానుంది.