కోల్కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ భద్రతను మమతా బెనర్జీ నేతృత్వంలోని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. దాదాకు ప్రాణ హాని ఉందనే ఇంటెలిజెన్స్ సమాచారంతో వై కేటగిరి సెక్యూరిటీ భద్రతను కల్పించిన బెంగాల్ ప్రభుత్వం ఇప్పుడు జెడ్ కేటగీరి రక్షణ కల్పించాలని నిర్ణయించింది.
వై కేటగిరి భద్రతా గడువు ముగియడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై గంగూలీకి 8 నుంచి 10 మంది పోలీసులు అన్ని వేళలా రక్షణగా ఉండనున్నారు. తనకు భద్రత పెంచాలని సౌరవ్ గంగూలీ కోరనప్పటికీ.. అతనికి మరింత భద్రత అవసరమని ప్రభుత్వమే భావించినట్లు తెలుస్తోంది.

వీవీఐపీల సెక్యూరిటీ గడువు ముగియడంతో.. సమీక్ష జరిపిన అధికారులు గంగూలీ సెక్యూరిటీని జెడ్ కేటగిరీకి పెంచాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు గంగూలీకి స్పెషల్ బ్రాంచ్ నుంచి ముగ్గురు పోలీసు అధికారులు రక్షణ కల్పించగా.. లాన్ ఎన్ఫోర్స్మెంట్కు చెందిన మరో ముగ్గురు అధికారులు ఆయన నివాసం వద్ద కాపలాగా ఉండనున్నారు.
ఐపీఎల్ 2023 సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్ క్రికెట్ డైరెక్టర్గా ఉన్న దాదా.. మే 21న కోల్కతాకు తిరిగి రానున్నాడు. అప్పటి నుంచి జెడ్ కేటగిరీ రక్షణ కల్పించనున్నట్లు బెంగాల్ ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
గతంలో మహేంద్ర సింగ్ ధోనీకి ఇంటెలిజెన్స్ సూచనలతో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించారు. కానీ ముప్పు లేదని తేలడంతో మళ్లీ వై కేటగిరీకి కుదించారు.
గంగూలీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ 2023 సీజన్లో దారుణంగా విఫలమైంది. వరుస పరాజయాలతో అందరి కన్నా ముందే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం దెబ్బకొట్టింది.