
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో సౌరవ్ గంగూలీ శకం ముగిసింది. బీసీసీఐ అధ్యక్షుడిగా మరో దఫా కొనసాగేందుకు బోర్డు పెద్దలు అంగీకరించలేదని ప్రచారం జరుగుతోంది. తదుపరి అధ్యక్షుడిగా భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ విజేత రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టడం ఖాయమని తెలుస్తోంది. అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ ఒక్కడే నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. దాదాను రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగేందుకు బోర్డు సభ్యులు అంగీకరించకపోవడంపై అనేక ఊహగానాలు వెలువడుతున్నాయి.
బీజేపీ పార్టీలో చేరనందుకే అతనిపై వేటు వేసారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆరోపిస్తుండగా.. మిత్రుడిగా ఉండి జై షా వెన్నుపోటు పొడిచాడని గంగూలీ అభిమానులు వాపోతున్నారు. కర్మఫలం అనుభవించాల్సిందేనని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఏది ఏమైనా బీసీసీఐ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి గంగూలీ తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
జాతీయ మీడియాలో ఇన్ని ఆరోపణలు వస్తున్నా.. అటు బీసీసీఐ పెద్దలు.. ఇటు సౌరవ్ గంగూలీ మౌనంగానే ఉన్నారు. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న దాదా.. బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి కోల్పోవడంపై తొలిసారి స్పందించాడు. బంధన్ బ్యాంక్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాదా.. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. అడ్మినిస్ట్రేటర్గా చాలా కాలం పని చేసిన తాను.. దానికి మించిన పనిని చేపట్టేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పాడు. అడ్మినిస్ట్రేటర్గా జీవిత కాలం ఉండటం కుదురదని, ఏ రోజైనా తప్పుకోవాల్సిందేనన్నాడు.
'నేను భారత కెప్టెన్గా సేవలందించాను. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా.. బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించాను. ఇప్పుడు వీటికి మించిన పనులు చేయాలనుకుంటున్నా. అయితే ఎప్పటికీ ప్లేయర్గా, అడ్మినిస్ట్రేటర్గా ఉండటం కుదురదు. ఏ రోజైనా తప్పుకోవాల్సిందే. ఈ రెండు బాధ్యతలు నిర్వర్తించడం గొప్పగా ఫీలవుతున్నా. నేను చరిత్రను ఎప్పుడూ నమ్మను. ఎవరైనా ఒక్క రోజులో అంబాని, నరేంద్ర మోదీలు కాలేరు. ఆ స్థాయికి చేరాలంటే నెలలకొద్ది కష్టపడాల్సి ఉంటుంది.'అని దాదా చెప్పుకొచ్చాడు.