
న్యూఢిల్లీ: తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలపై టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి అవకాశాలు వస్తాయో, అవి ఎక్కడిదాకా వెళ్తాయో చూడాలన్నాడు. దాదాను తమతో కలుపుకునేందుకు అటు టీఎంసీ, ఇటు బీజేపీ పోటీపడుతున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో ఖండించిన దాదా.. ఇప్పుడు మాత్రం మరోలా స్పందించాడు. తాజాగా బెంగాల్ మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో ఇప్పటి వరకు ఏదీ ప్లాన్ ప్రకారం జరగలేదన్నాడు.
'మనకు ఎలాంటి అవకాశాలు వస్తాయి. అవి ఎంతవరకు వెళ్తాయి. వాటి నుంచి మనం ఏం తీసుకుంటామో నిర్ణయించుకోవాలి. నా లైఫ్లో చాలా ట్విస్ట్లు, టర్న్లు ఉన్నాయి. తర్వాత ఎంటనే దాని గురించి నా వద్ద ఎప్పుడూ క్లూ ఉండదు. నేను భారత్కు కెప్టెన్ అయినప్పుడు సచిన్ ఆ పోస్ట్లో ఉన్నాడు. కాబట్టి దానిని నేను ఊహించలేదు. అతను రాజీనామా చేయకపోతే నాకు ఆ పోస్ట్ దక్కేది కాదు. అలాగే, నేను బీసీసీఐ ప్రెసిడెంట్ అవుతానని కొన్ని నిమిషా ముందు వరకు కూడా అనుకోలేదు. కానీ అయ్యా. నా లైఫ్లో ఏదీ ప్లాన్ ప్రకారం జరగలేదు. అందుకే పాలిటిక్స్ కూడా ఎంతవరకు వెళ్తాయో చూద్దాం'అని దాదా పేర్కొన్నాడు.
రకరకాల కోణాల్లో, భిన్నమైన పరిస్థితులకు అనుగుణంగా వచ్చే అవకాశాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. అయితే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో దాదా వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. ''ఇప్పుడు నేను ఫిట్గా ఉన్నా. దేవుడు చల్లని చూపు చూశాడు. అది చిన్న ఇబ్బంది. తిరిగి విధుల్లో చేరిపోయా'' అని గంగూలీ అన్నాడు. ఇంగ్లండ్తో రెండు, మూడో టీ20 మ్యాచ్లు వీక్షించేందుకు అహ్మదాబాద్ వెళ్తానని చెప్పాడు. అంతకు ముందు వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ వేదిక మారిందని తెలిపాడు. లార్డ్స్లో కాకుండా సౌతాంప్టన్ వేదికగా జరగనుందని స్పష్టం చేశాడు.