
కోల్కతా: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ నిర్వహణ కష్టమేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. సోమవారం బీసీసీఐ అధికారులతో చర్చించిన అనంతరం మరింత స్పష్టతనిస్తామని తెలిపాడు. ఈ సీజన్ ఐపీఎల్ నిర్వహణపై శనివారం మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించాడు. ప్రస్తుత పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామనీ.. ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నాడు. అయినా, ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉన్నప్పుడు క్రీడల భవిష్యత్ ఏముంటుందని ప్రశ్నించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించడం కష్టతరమని అభిప్రాయపడ్డాడు.
'కరోనా వైరస్ నేపథ్యంలో ఏం జరుగుతుందో అంతా గమనిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చెప్పలేం. అయినా, ఇప్పుడు చెప్పడానికి ఏముంది? విమానాశ్రయాలు మూతపడ్డాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు, కార్యాలయాలు లాక్డౌన్లో ఉన్నాయి. ఎవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లలేరు. ఈ పరిస్థితి మే మధ్య వరకూ ఉంటుందనిపిస్తోంది.
ఇలాంటి సందర్భాల్లో ఆటగాళ్లను ఎక్కడి నుంచి తీసుకొస్తారు. ఐపీఎల్ను పక్కన పెట్టండి. కాస్త ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే.. ప్రపంచంలో ఎక్కడా ఏ క్రీడలు నిర్వహించడానికి కూడా అవకాశం లేదు' అని గంగూలీ మండిపడ్డాడు. చివరగా బీసీసీఐ అధికారులతో చర్చించి సోమవారం అప్డేట్ ఇస్తానని చెప్పాడు. అసలు ప్రపంచవ్యాప్తంగా జనజీవనం స్తంభించినప్పుడు క్రీడలకు భవిష్యత్ ఎక్కడుందని ప్రశ్నించాడు.
నిరవధిక వాయిదా..
ఐపీఎల్-13వ సీజన్ నిరవధికంగా వాయిదా పడటం ఖాయమైనట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా... శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్లో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈనెలాఖరువరకు లాక్డౌన్ పొడిగింపునకు మొగ్గు చూపడంతో ఐపీఎల్ టోర్నీ జరిగే పరిస్థితి కనిపించడంలేదు. 'పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు లాక్డౌన్ను పొడిగించాయి. ఫలితంగా ప్రస్తుతానికైతే ఐపీఎల్ జరిగే పరిస్థితి లేదు. దాంతో ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేయక తప్పదు. కానీ ఈ ఏడాది టోర్నీని రద్దు చేసే ఆలోచన లేదు.' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.