టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీలాంటి ఆటగాళ్లు తరానికి ఒక్కరే ఉంటారని కొనియాడాడు. మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్, జులాన్ గోస్వామి ఎలానో పురుషుల క్రికెట్లో కోహ్లీ అలాంటి ఆటగాడని చెప్పుకొచ్చాడు.
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సౌరవ్ గంగూలీని కోహ్లీ ఫామ్ గురించి ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబరుస్తాడని తెలిపాడు.

80 సెంచరీలు ఈజీ కాదు..
'మహిళా క్రికెట్లో జులాన్ గోస్వామి, మిథాలీ రాజ్ తరహాలోనే విరాట్ కోహ్లీ అత్యంత అరుదైన ఆటగాడు. అంతర్జాతీయ కెరీర్లో 80 శతకాలు సాధించడం ఆశ మాషి కాదు. నా వరుకు అయితే విరాట్ కోహ్లీనే వరల్డ్ బెస్ట్ వైట్బాల్ క్రికెటర్. ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్ టెస్ట్ శతకం తర్వాత కోహ్లీ ఆడిన తీరు నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలోనూ అతను ఇలానే తడబడ్డాడు.
అయితే పెర్త్లో సెంచరీ చేసిన తర్వాత అతనికి ఇది పెద్ద సిరీస్ అవుతుందని అనుకున్నా. కానీ అతను విఫలమయ్యాడు. ప్రతీ ఆటగాడికి బలాలు, బలహీనతలు ఉంటాయి. బలహీనతలు లేని ఆటగాడు ఈ ప్రపంచంలోనే లేడు. కానీ ఆ బలహీనతలను ఎలా అధిగమిస్తారన్నదే ముఖ్యం.
ఇంగ్లండ్ టూర్ బిగ్ ఛాలెంజ్..
విరాట్ కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉంది. ఇంగ్లండ్ పర్యటన అతనికి పెద్ద సవాల్గా మారనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అతని ఫామ్పై నేను పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే అతను వరల్డ్ గ్రేటెస్ట్ వైట్ బాల్ ప్లేయర్. ఎలాంటి కండిషన్స్లోనైనా అతను పరుగులు చేస్తాడు. కానీ టెస్ట్ క్రికెట్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.
స్వింగ్, సీమింగ్ పిచ్లపై ఆడాల్సి ఉంటుంది. విదేశాల్లో తొలి ఇన్నింగ్స్లో 350-400 పరుగులు చేస్తే గెలిచే పరిస్థితుల్లో ఉంటారు. 200లోపు ఆలౌటైతే డ్రా కోసం ఆడాల్సి ఉంటుంది. పెర్త్లో భారత్ గెలవడానికి రెండో ఇన్నింగ్స్లో 400-500 పరుగులు చేయడమే కారణం.'అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.
షమీ రాకతో..
మహమ్మద్ షమీ రీఎంట్రీతో టీమిండియా బలం పెరిగిందని, ఛాంపియన్స్ ట్రోఫీలో తిరుగుండదని గుంగూలీ అభిప్రాయపడ్డాడు. 'షమీ రీఎంట్రీ ఇవ్వడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే అతను జస్ప్రీత్ బుమ్రా తర్వాత అతనే అత్యుత్తమ భారత బౌలర్. షమి కాస్త భయాందోళనలో ఉండవచ్చు. ఎందుకంటే సుదీర్ఘ కాలం తర్వాత మోకాలి నుంచి కోలుకొని క్రికెట్ ఆడుతున్నాడు. కానీ, దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరఫున ఆడటం అతనికి కలిసొచ్చే అంశం.
ఈ అనుభవం అతనికి ఛాంపియన్స్ ట్రోఫీలో ఉపయోగపడనుంది. షమీ ఎంట్రీతో బుమ్రాపై వర్క్లోడ్ తగ్గనుంది. బుమ్రా ఒక ఎండ్ నుంచి.. షమీ మరో ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తే జట్టుకు కలిసొస్తుంది. పరస్పర సహకారంతోనే ఇద్దరు టెస్ట్ క్రికెట్లో సక్సెస్ అయ్యారు.'అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.