న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలను టీ20లకు దూరంగా పెట్టడాన్ని మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తప్పుబట్టాడు. ఎంతో అనుభవమైన ఈ ఇద్దరీని జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అసలు వీరిద్దర్నీ ఎందుకు పక్కనపెట్టారో తనకు అర్థం కావడం లేదన్నాడు.
గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ, రోహిత్లను సెలెక్టర్లు టీ20లకు దూరంగా ఉంచారు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ జట్టును టీ20 ప్రపంచకప్ 2024 కోసం సిద్దం చేస్తున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా.. గత మూడు సిరీస్ల్లో కోహ్లీ, రోహిత్తో పాటు సీనియర్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వలేదు. వెస్టిండీస్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులోనూ ఈ ఇద్దరికీ చోటు దక్కలేదు.

ఈ క్రమంలోనే టీ20 సెలెక్షన్పై స్పందించిన గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఎప్పుడైనా మంచి జట్టునే ఎంపిక చేయాలి. ఎంత పెద్ద ఆటగాడైనా జట్టుకు అసరమైతేనే తీసుకోవాలి. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు టీ20ల్లో ఇప్పటికీ చోటు ఉంది. వారు ఎందుకు ఆడటం లేదనే విషయం తెలియడం లేదు.
ఐపీఎల్లో కోహ్లీ మంచి ఫామ్ కనబర్చాడు. అందుకే, ఇద్దరినీ టీ20ల్లోకి తీసుకోవాలి. సీనియర్లు ఉండటం వల్ల జట్టులోని యువ ప్లేయర్లకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. విండీస్తో సిరీస్కు రింకు సింగ్, రుతురాజ్ గైక్వాడ్, జితేశ్ శర్మను ఎంపిక చేయలేదు. వారికి అవకాశం రాకపోయినా యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లకే అవకాశం దక్కింది.
కాస్త ఆలస్యమైనా తప్పకుండా అవకాశం వస్తుంది. అప్పటి వరకు ఓపికగా ఆడుతూనే ఉండాలి. మరింత నేర్చుకుంటూ ముందుకు సాగాలి. నిలకడైన ప్రదర్శన కనబరిస్తే జట్టులోకి రావడం సులభం. ఎప్పుడైనా 15 మందినే తీసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ 11 మందే తుది జట్టులో ఆడుతారు. కొంతమందిని పక్కన పెట్టాలి. అయితే, తప్పకుండా అందరికీ అవకాశాలు వస్తాయనే నమ్మకం నాకు ఉంది.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.