
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్లో పేలవ ఫామ్తో సతమతమవుతున్న విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్కు కూడా విశ్రాంతి ఇచ్చే యోచనలో ఉన్నామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన కోహ్లి కేవలం 128 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లి ఆటతీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న వేళ అతని ఫామ్పై దాదా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి ఫామ్లోకి వస్తాడంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లితో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపై కూడా గంగూలీ స్పందించాడు.
'విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇద్దరు గొప్ప ఆటగాళ్లు. వాళ్లిద్దరు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏం లేదు. కచ్చితంగా ఫామ్ అందుకొని పరుగులు సాధిస్తారు. ఇక కోహ్లీ మైండ్లో ఏం ఆలోచనలు తిరుగుతున్నాయో చెప్పలేను కానీ అతను మాత్రం కచ్చితంగా ఫామ్ను అందుకుంటాడు. కోహ్లీ ఒక మంచి ప్లేయర్.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టీ20 ప్రపంచకప్కు చాలా సమయం ఉంది. కోహ్లీ జట్టులో ఉంటాడా? లేదా అనేది అవవసరమైన చర్చ. తీరికలేని షెడ్యూల్తో బిజీగా ఉన్న కారణంగా సౌతాఫ్రికాతో అతనికి విశ్రాంతినిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం.
కోహ్లీ ఒక్కడే కాదు.. రోహిత్, కేఎల్ రాహుల్ సహా మిగతా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం. కోహ్లీని పూర్తిగా పక్కనపెడ్తాం అనే వార్తల్లో వాస్తవం లేదు. ఒకవేళ అతను సౌతాఫ్రికాతో సిరీస్ ఆడాలనుకుంటే మాత్రం ఆడుతాడు. ఏదైనా అతన్ని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం.
కరోనా భయంతో ఐపీఎల్లో బయోబబుల్ను ప్రవేశపెట్టాం. దేశంలో కరోనా కేసుల్లో పురోగతి లేదనిపిస్తే ఐపీఎల్లో బయోబబూల్ను తొలగించే అవకాశం ఉంది. కానీ ఏదైనా వేచి చూస్తే మంచిది. ఎందుకంటే కోవిడ్ మనతో పాటు మరో 10 సంవత్సరాలైనా ఉంటుంది. దానిని మనం అలవాటు చేసుకోవాలి. ఆటగాళ్ల శ్రేయస్సు కొరకే బయో బబూల్. కరోనా తగ్గిందంటే ఆటోమెటిక్గా బయోబబుల్ మాయమవుతుంది'' అంటూ దాదా పేర్కొన్నాడు.