Sourav Ganguly: వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ వరకు టీమిండియా సారథిగా రోహిత్ శర్మనే కొనసాగాలని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. మూడు ఫార్మాట్లలో అతనే టీమిండియాను నడిపించాలన్నాడు. అతను కెప్టెన్గా ఉంటేనే టీమిండియాకు ఆశించిన ఫలితాలు దక్కుతాయని అభిప్రాయపడ్డాడు.
వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా పరమిత ఓవర్ల సిరీస్లకు ఈ ఇద్దరూ దూరంగా ఉన్నారు. వైట్ బాల్ ఫార్మాట్కు పూర్తిగా దూరమవుతారనే ప్రచారం జరుగుతోంది.

మాజీ క్రికెటర్లు మాత్రం కోహ్లీ, రోహిత్.. టీ20 ప్రపంచకప్ 2024 ఆడాలని సూచిస్తున్నారు. వారి అనుభవం జట్టుకు కలిసొస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మపై సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు.
'చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవడం సమస్యగా మారింది. సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే వన్డేల్లో అతని స్థానంలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కాబట్టి 50 ఓవర్ల క్రికెట్కు మరో కెప్టెన్గా రాహుల్కు బాధ్యతలు అప్పగించారు. రోహిత్ శర్మ కేవలం టెస్ట్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాడు. కాబట్టి అతనే కెప్టెన్గా కొనసాగుతాడు.
వాస్తవానికి రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో ఆడాలి. వన్డే ప్రపంచకప్లో అతని సారథ్యంలో టీమిండియా అద్భుతంగా ఆడింది. అతను గొప్ప నాయకుడు. టీ20 ప్రపంచకప్ ముగిసేవరకు అతను అన్ని ఫార్మాట్లలో కెప్టెన్గా కొనసాగాలి.'అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ భారత క్రికెట్లో అంతర్భాగమని చెప్పిన గంగూలీ.. ప్రపంచకప్లో అసాధారణ ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు. టీ20 ప్రపంచకప్ 2024లోనూ ఇదే జోరు కొనసాగిస్తారని ఆశిస్తున్నానని తెలిపాడు.