
న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. టెస్ట్ క్రికెట్లో అశ్విన్ చరిత్ర సృష్టిస్తాడని తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్లో అశ్విన్ అద్భుత ప్రదర్శన కనర్చాడు. తొలి ఇన్నింగ్స్లోనే 6 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్(113) నిలిచాడు. ఈ క్రమంలో నాథన్ లయన్ రికార్డును సమం చేశాడు.
లయన్ 26 టెస్టుల్లో 113 వికెట్లు తీయగా.. అశ్విన్ కేవలం 22 టెస్టుల్లోనే అతని సరసన నిలిచాడు. ఈ క్రమంలోనే అశ్విన్ ప్రదర్శనపై సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. టెస్టు క్రికెట్లో అశ్విన్ చరిత్ర సృష్టిస్తాడని కొనియాడాడు. 'అహ్మదాబాద్లాంటి పిచ్ మీద అశ్విన్ వికెట్లు తీయడం అమోఘం. అతని బౌలింగ్ క్లాస్గా ఉంటుంది. టెస్టు క్రికెట్లో అశ్విన్ చరిత్ర సృష్టిస్తాడు. తప్పకుండా ఈ సిరీస్లో ఇదొక మంచి టెస్టు మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నా. ఇప్పటిదాకా కఠినమైన పిచ్లపై బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లకు ఈ వికెట్ ద్వారా మంచి అవకాశం వచ్చినట్లే''అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
ఇక స్వదేశంలో 26 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్గా అశ్విన్ రికార్డు నమోదు చేశాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ అధిగమించాడు. అశ్విన్ కెరీర్లో మొత్తం 32 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేయడం గమనార్హం. ఇప్పటి వరకు అశ్విన్ టెస్ట్ల్లో 473 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఉస్మాన్ ఖవాజా(180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలతో తొలి ఇన్నింగ్స్లో 480 పరుగులు చేసింది.
రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్కు చెరొక వికెట్ దక్కింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ధీటుగా బదులిస్తోంది. శుభ్మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకోగా.. చతేశ్వర్ పుజారా హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. రోహిత్ శర్మ(35) విఫలమైనా ఈ ఇద్దరూ నిలకడగా ఆడుతూ జట్టు స్కోర్ను ముందుకు తీసుకెళ్తున్నారు.