
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆటలన్నీ ఆగిపోయాయి. ఈ ప్రాణాంతక వైరస్ తీవ్రత ఎప్పుడు తగ్గుతుందో.. టోర్నీలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో టోర్నీలను నిర్వహించాలనే ప్రదిపాదనలు ఊపందుకున్నాయి. జర్ననీలో ఫుట్బాల్ టోర్నీలను ఇలా ఖాళీ మైదానాల్లో చడి చప్పుడే లేకుండా నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. మే తొలి వారం నుంచి ఈ టోర్నీలు జరగనున్నాయ
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్ల నిర్వహణ ప్రతిపాదనపై స్పందించింది. ఇది సాధ్యం కాదని అభిప్రాయపడింది. ఇప్పట్లో భారత్లో మ్యాచ్లు జరిగే అవకాశం లేదని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు.
'భారత్, జర్మనీల సామాజిక పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. సమీప భవిష్యత్తులో భారత్లో క్రికెట్ ఉండదు. కానీ, ఒకవేళ... అనే అంశాలు చాలా ఉన్నాయి. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న సమయంలో ఏ క్రీడాపోటీలు జరగవని అనుకుంటున్నా' అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. కరోనా నిర్మూలన మందు వచ్చే వరకు క్రికెట్ జరగకపోవచ్చన్నాడు. 'ఒక వేళ ప్రేక్షకుల్లేకుండా ఐపీఎల్ నిర్వహిస్తే ఆయా జట్లు ప్రయాణించేటప్పుడు, హోటళ్లు, స్టేడియాలకు వెళ్లేటప్పుడు అభిమానులు ఖచ్చితంగా గుమిగూడుతారు. ఇలాంటి స్థితిలో భౌతిక దూరం పాటించేలా.. వారిని నిలవరించడం చాలా కష్టం. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు క్రికెట్ జరుగకపోవచ్చు'అని భజ్జీ వ్యాఖ్యానించాడు.
ఫుట్బాల్ పోటీలు ప్రేక్షకులు లేకుండా నిర్వహించినా టీవీ సిబ్బందితో పాటు మిగతా విభాగాల సిబ్బంది వందల సంఖ్యలో పని చేయాల్సి ఉంటుందని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్) అధ్యక్షుడు సుబ్రతా దత్ చెప్పాడు. అందులో ఎవరికి కరోనా ఉన్నా కష్టమవుతుందన్నాడు.