
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ పేలవ ఫామ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. రాహుల్ వరుసగా విఫలమవుతున్నా? అవకాశాలు ఎందుకు ఇస్తున్నారని మాజీ క్రికెటర్లు, అభిమానులు బీసీసీఐని నిలదీస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. జట్టులో కేఎల్ రాహుల్ ఒక్కడే విఫలమవ్వడం లేదని, ఇంకొందరు ప్లేయర్లు కూడా పరుగులు చేయడం లేదన్నాడు. పరోక్షంగా విరాట్ కోహ్లీ, చతేశ్వర పుజారాల ఫామ్ను దాదా ప్రస్తావించాడు.
'భారత్లో కూడా పరుగులు చేయలేకపోతే ఏ ఆటగాడైనా విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. కేఎల్ రాహుల్ వైఫల్యం గురించే మాట్లాడుతున్నారు. కానీ జట్టులో ఇంకొందరు కూడా రాణించలేకపోతున్నారు. ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లపై సహజంగానే ఒత్తిడి ఉంటుంది. వాళ్లు ఎలా ఆడుతారని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ప్లేయర్పై మరింత ఒత్తిడిని తీసుకొస్తుంది. టీమ్మేనేజ్మెంట్ మాత్రం ఆ ప్లేయర్ జట్టుకు ఎంత ముఖ్యమో అనే కోణంలో ఆలోచిస్తుంది. చివరకు కోచ్, కెప్టెన్ కలిసి తుది నిర్ణయం తీసుకుంటారు.
కేఎల్ రాహుల్ గతంలో చాలా సార్లు జట్టును గెలిపించాడు. వరుసగా విఫలమైనప్పుడు ఇలాంటి విమర్శలు సహజమే. ఈ పరిస్థితి నుంచి బయటపడటం రాహుల్కు తెలుసు. అతనికి ఆ సత్తా ఉంది. ఫామ్లో లేనప్పుడు సాధారణ పిచ్ కూడా క్లిష్టంగా కనిపిస్తోంది. రాహుల్ కీలకమై ఆటగాడు కావడంతోనే అతనికి వరుస అవకాశాలు ఇస్తున్నారు.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఉద్దేశ పూర్వకంగానే గంగూలీ.. మరోసారి కోహ్లీని టార్గెట్ చేశాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. స్ట్రింగ్ ఆపరేషన్లో గంగూలీ-కోహ్లీ మధ్య విబేధాలు ఉన్నాయని మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చెప్పిన విషయం తెలిసిందే. ఈ విబేధాల నేపథ్యంలోనే కోహ్లీ కెప్టెన్సీ వదులుకొని మీడియా ముందు దాదాను ఇరికించాడని చెప్పుకొచ్చాడు.