
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో ఒత్తిడిని అధగమించే తీరే అతన్ని అభిమానించేలా చేసిందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఇక భారత్ క్రికెట్కు అసాధారణ ఆటగాడైన ధోనీ దొరకడం తనను చాలా సంతోషపరిచిందన్నాడు. ఇటీవల భారత యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్తో మాట్లాడిన దాదా.. ఈ సందర్భంగా ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు. మహీ బర్త్డే నేపథ్యంలో ఈ వీడియోను బీసీసీఐ మంగళవారం ట్వీట్ చేసింది.
'2004లో బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో ధోనీని ఎంపిక చేయాలని సెలెక్టర్లను కోరాను. కానీ ఒక కెప్టెన్గా నేను జట్టును మాత్రమే ఏంచుకోగలను.. నేను జట్టులోకి తీసుకున్న ధోనీ ఆ మ్యాచ్లో విఫలమయ్యాడు. కానీ అతని ఆటతీరుపై నాకు నమ్మకముంది. ఒక వికెట్కీపర్గా జట్టులోకి వచ్చిన మహీని పాక్తో జరిగిన రెండో వన్డేకు రాహుల్ ద్రవిడ్ను కాదని నెంబర్ 3 స్థానంలో ధోనీని పంపాలని నిర్ణయించుకున్నా.
సరిగ్గా ఇదే మ్యాచ్లో ధోనీ తన ఆటతీరు ఎలా ఉంటుందో మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక అక్కడినుంచి వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ప్రపంచ క్రికెట్లో అతనొక అత్యుత్తమ ఆటగాడే కాదు.. మంచి ఫినిషర్ కూడా. ఎన్నో మ్యాచ్ల్లో ఫినిషర్గా వచ్చి లోయర్ ఆర్డర్ సాయంతో జట్టును గెలిపించిన తీరుపై ఇప్పటికి మాట్లాడుతూనే ఉంటారు. ప్రతీ సంవత్సరం కొత్త ఆటగాళ్లు క్రికెట్లో పరిచయం అవుతుంటారు.
కానీ ఒక దశాబ్ధంలో కొందరే క్రికెటర్లు తమదైన ముద్ర వేస్తారు. అందులో ధోనీకి కూడా సమున్నతమైన స్థానం ఉందనడంలో సందేహం లేదు. ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు తమ జట్టును గెలిపించాలనే ఉత్సాహంతో చాలా మంది ఆటగాళ్లు ఒత్తిడికి లోనవుతుంటారు, కానీ ధోనీ మాత్రం ఒత్తిడిని జయించి ఎన్నో మ్యాచ్ల్లో గెలిపించాడు. అదే ఎంఎస్ ధోనీ ప్రత్యేకత.. అందుకే నేను మహీకి ప్రియమైన అభిమానిగా మారిపోయాను. నిజంగా టీమిండియాకు ధోనీ లాంటి ఆటగాడు దొరకడం అదృష్టంగా చెప్పొచ్చు.'అంటూ చెప్పుకొచ్చాడు. సుధీర్ఘ పార్మాట్లో 90 టెస్టులాడిన ధోనీ 4,786 పరుగులు చేశాడు. ఇక ఇప్పటివరకు 350 వన్డేలాడిన ధోనీ 10773 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 73 అర్థ సెంచరీలు ఉన్నాయి.