టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలవడంతో దేశమంతా సంబరాలు చేసుకున్నారని, రోహిత్ శర్మను కెప్టెన్గా చేసిన తనను మాత్రం అందరూ మర్చిపోయారని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. రోహిత్ను కెప్టెన్గా నియమించినప్పుడు తనను చాలా మంది విమర్శించారని, అతని సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ గెలిస్తే మాత్రం ఎవరూ తనను గుర్తించడం లేదని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియా ఘోర పరాజయం అనంతరం పొట్టి ఫార్మాట్ సారథ్యానికి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పగా.. వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా అతన్ని బీసీసీఐ తప్పించింది. అప్పట్లో ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగింది. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని విరాట్ కోహ్లీ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై మండిపడ్డాడు. విరాట్ కోహ్లీని ఒప్పించే ఈ నిర్ణయం తీసుకున్నానని సౌరవ్ గంగూలీ మీడియాకు తెలియజేయగా.. విరాట్ కోహ్లీ అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఉద్దేశపూర్వకంగానే విరాట్ కోహ్లీని సారథ్య బాధ్యతల నుంచి తప్పించారనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
ఈ వ్యవహారంతో ఇప్పటికీ సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మాట్లాడుకోవడం లేదు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా డబ్ల్యూటీసీ 2023 ఫైనల్తో పాటు వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఓటమిపాలైంది. టీ20 ప్రపంచకప్ 2022లో సెమీస్లోనే వెనుదిరిగింది. టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం విజేతగా నిలిచింది.
ఈ క్రమంలోనే రోహిత్ శర్మను కెప్టెన్ చేసిన క్రెడిట్ తనదేనని గంగూలీ గుర్తు చేశాడు. 'నేను రోహిత్ శర్మను కెప్టెన్గా ఎంపికచేసినప్పుడు అందరూ నన్ను విమర్శించారు. ఇప్పుడు అతని సారథ్యంలోనే భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచింది. దాంతో అందరూ నన్ను విమర్శించడం మానేశారు. ఆ విషయాన్నే పూర్తిగా మరిచిపోయారు. రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్గా నియమించింది నేనే'అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.