
న్యూఢిల్లీ: బోర్డు నిబంధనలకు విరుద్దంగా టీమ్ సెలెక్షన్లో జోక్యం చేసుకుంటున్నాడని తనపై వచ్చిన ఆరోపణలను భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఖండించాడు. ఇవి అర్థం పర్థం లేని ఆరోపణలని, పనికిమాలిన విషయాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బీసీసీఐ ప్రెసిడెంట్గా వీటిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశాడు.
ఇక విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలిగించినప్పటి నుంచి సౌరవ్ గంగూలీ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. కెప్టెన్సీ తొలగింపు వ్యవహారంలో గంగూలీ చేసిన వ్యాఖ్యలకు విరుద్దంగా ప్రెస్మీట్లో విరాట్ మాట్లాడటంతో అతన్ని ఇరుకునపడేసాయి. అప్పటి నుంచి ఏదో విషయంలో గంగూలీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా సెలెక్షన్ కమిటీ వ్యవహారాల్లో గంగూలీ తలదూరుస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు విరాట్ కోహ్లీ, బీసీసీఐ సెక్రటరీ జై షాలతో కలిసి గంగూలీ సమావేశమైన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అయింది.
ఈ వార్తలను గంగూలీ ముందు ప్రస్తావించగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నేను బీసీసీఐకి అధ్యక్షుడి హోదాలో ఉన్నా. అలాంటి గొప్ప స్థానంలో ఉన్న నాకు ఈ పిచ్చి ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదు. ఒక బీసీసీఐ బాస్గా నా పనేంటో తెలుసు. ప్రస్తుతం అదే చేస్తున్నా. సెలక్షన్ కమిటీ మీటింగ్లో నా ఫోటోను పెట్టి నిబంధనలు అతిక్రమించాడని ఇష్టమొచ్చినట్లు వార్తలు రాశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా.
ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలచుకున్నా. సెక్రటరీ జై షా, విరాట్ కోహ్లీతో కలిసి ఫోటో దిగినంత మాత్రానా నేను సెలక్షన్ కమిటీ మీటింగ్కు హాజరైనట్లు ఎలా చెప్పగలరు.? అది బయటో ఎక్కడో కలిసిన సందర్భంలో తీసిన ఫోటో అని భావించొచ్చు కదా.. అయినా ఇలాంటి పిచ్చి ఆరోపణలు నాకు అవసరం లేదు. టీమిండియా తరపున 424 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన నాకు నిబంధనలు ఏంటనేవి తెలియవా? 'అని దాదా ప్రశ్నించాడు.