
ముంబై: ఎన్నో ఏళ్లుగా టీ20 లీగ్ కోసం ఎదురుచూస్తున్న భారత మహిళా క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచి 6 జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సీజన్లో మాత్రం మూడు టీమ్స్ మధ్య నాలుగు ఎగ్జిబిషన్ మ్యాచ్లు జరుగుతాయని పేర్కొంది. శుక్రవారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని వెల్లడించాడు.
'మహిళల కోసం పూర్తి స్థాయి ఐపీఎల్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం. సర్వసభ్య సమావేశంలో దీనికి ఆమోదం పొందాల్సి ఉంది. వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ ఆరంభమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తాం'అని గంగూలీ చెప్పాడు.
తొట్టతొలి మహిళల ఐపీఎల్ను అయిదు లేదా ఆరు జట్లతో నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. మహిళల టోర్నీలో పెట్టుబడులు పెట్టేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఆసక్తిని చూపిస్తున్నట్లు సమాచారం. మహిళల టీమ్స్ కొనుగోలు చేసేందుకు ప్రస్తుత ఫ్రాంచైజీలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇప్పటికే మూడు ఫ్రాంచైజీలు ఇందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
'ఐపీఎల్-15 ప్లేఆఫ్స్ సమయంలోనే మహిళల కోసం మూడు జట్లు తలపడే నాలుగు ఎగ్జిబిషన్ మ్యాచ్లు నిర్వహిస్తాం'' అని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ చెప్పాడు. కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్ రెండో దశను యూఏఈలో నిర్వహించడంతో మహిళలకు ఎగ్జిబిషన్ మ్యాచ్లను రద్దు చేశారు. 2020లో నిర్వహించిన ఎగ్జిబిషన్ మ్యాచ్ల్లో ట్రయల్ బ్లేజర్స్ విజేతగా నిలిచింది. ఈసారి మహిళల మ్యాచ్లకు పుణె వేదికగా నిలిచే అవకాశం ఉంది.
అలాగే వచ్చే ఐదేళ్ల కాలానికి(2023-27) ఐపీఎల్ మీడియా హక్కుల గురించి కూడా ఈ మీటింగ్లో చర్చించారు. త్వరలో ఇందుకోసం టెండర్లు పిలుస్తామని ఓ అధికారి అన్నారు. రిలయన్స్, హాట్స్టార్, సోనీ, అమెజాన్ ఈ హక్కులు దక్కించుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.