
న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తప్పించడానికి గల కారణాలను భారత క్రికెట్ నియంత్రణమండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవద్దని కోహ్లీకి ఎంత చెప్పినా వినలేదన్నాడు. అయితే పరిమిత ఓవర్లో ఇద్దరు కెప్టెన్లు ఉండటం మంచిది కాదని భావించి బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశాడు. గురువారం ప్రముఖ వార్త సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించాడు. ఇన్నాళ్లు పరిమిత ఓవర్లో జట్టును నడిపించిన విరాట్ కోహ్లీకి దాదా కృతజ్ఞతలు తెలిపాడు.
'బీసీసీఐ, సెలెక్టర్లందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. వాస్తవానికి టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవద్దని కోహ్లీని బీసీసీఐ రిక్వెస్ట్ చేసింది. కానీ అతను ఒప్పుకోలేదు. ఇక వైట్ బాల్ ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండటం సరికాదని సెలెక్టర్లు భావించారు. దాంతోనే విరాట్ కోహ్లీని టెస్ట్ కెప్టెన్గా కొనసాగించి రోహిత్ శర్మకు వన్డే సారథ్య బాధ్యతలు ఇవ్వాలని భావించింది. బీసీసీఐ ప్రెసిడెంట్గా నేను కూడా కోహ్లీతో వ్యక్తిగతంగా ఈ విషయంపై మాట్లాడాను. సెలెక్టర్లు కూడా ఈ విషయంపై కోహ్లీతో చర్చించారు. అతనికి చెప్పిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ శర్మ సారథ్య సామర్థ్యాలపై మేం పూర్తి నమ్మకం ఉంచాం. ఇక విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్గా కొనసాగుతాడు. భారత క్రికెట్ మంచి వ్యక్తుల చేతుల్లో పెట్టామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. పరిమిత ఓవర్ల కెప్టెన్గా కోహ్లీ అందించిన సేవలకు కృతజ్ఞతలు'అని దాదా చెప్పుకొచ్చాడు.
ఇక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత టెస్ట్ జట్టును ఎంపిక చేసిన చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. ఆ వివరాలను బుధవారం వెల్లడించింది. టెస్ట్ల్లో రోహిత్ శర్మను వైస్ కెప్టెన్గా నియమించింది. ఈ క్రమంలోనే వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తున్నట్లు ప్రకటించింది. విరాట్ కోహ్లీ పేరు ప్రస్తావించకుండా సింపుల్గా.. టీమిండియా టీ20, వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగుతాడని పేర్కొంది.