
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో సౌరవ్ గంగూలీ శకం ముగిసింది. అధ్యక్షుడిగా మూడేళ్లు సేవలు అందించిన దాదా.. రెండోసారి కొనసాగేందుకు బోర్డు సభ్యులు అంగీకరించలేదు. గంగూలీ వారసుడిగా రోజర్ బిన్నీ నియామకం మంగళవారం ఖారారైంది. ముంబైలో మంగళవారం జరిగిన బీసీసీఐ 91 వార్షిక సమావేశంలో బోర్డు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి మరొకరు పోటీ చేయకపోవడంతో రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జైషా కార్యదర్శిగా మరోసారి కొనసాగనున్నారు. ఈ ఏజీఎంలో మహిళా ఐపీఎల్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మీటింగ్ అనంతరం మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడారు. రోజర్ బిన్నీతో పాటు కొత్త కార్యవర్గానికి తన బెస్ట్ విషెస్ తెలియజేశాడు. కొత్త కార్యవర్గంలో బోర్డు ప్రతిష్ట మరింత పెరగాలని ఆకాంక్షించాడు. 'రోజర్ బిన్నీకి ఆల్ ది బెస్ట్. కొత్త కార్యవర్గం బోర్డు మరిన్నీ విజయాలు అందుకోవాలి. బీసీసీఐ గొప్ప వ్యక్తుల చేతుల్లో ఉంది. భారత క్రికెట్ గొప్ప స్థాయిలో ఉంది. బిన్నీకి గుడ్ లక్ చెబుతున్నా'అని దాదా పేర్కొన్నాడు.
అయితే 2019లో బ్రిజేష్ పటేల్ను వెనక్కు నెట్టి బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన దాదా.. తనదైన మార్క్ చూపెట్టాడు. టీమిండియా కెప్టెన్గా భారత జట్టులో ఎలాంటి విప్లవాన్ని తీసుకొచ్చాడో.. బోర్డు అధ్యక్షుడిగా కూడా అదే దూకుడును కొనసాగించాడు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ 2020, 2021, 2022 సీజన్లను విజయవంతంగా నిర్వహించాడు. కరోనా కేసులతో మధ్యలో బ్రేక్ పడినా.. చాకచక్యంగా వ్యవహరించి పూర్తి చేశాడు. కొత్త ఐపీఎల్ టీమ్స్తో బోర్డుకు కోట్ల సంపద తీసుకొచ్చాడు.
మీడియా రైట్స్, ద్వితీయ శ్రేణి జట్లతో మ్యాచ్లు నిర్వహించి బోర్డు ఆదాయాన్ని పెంచాడు. పింక్ బాల్ టెస్ట్లకు ప్రాధాన్యత ఇచ్చి టెస్ట్ ఫార్మాట్కు ప్రేక్షకాదరణ పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. మహిళా ఐపీఎల్కు రోడ్ మ్యాప్ సిద్దం చేశాడు. డొమెస్టిక్ క్రికెట్ వేతనాలను పెంచడంతో పాటు మాజీ క్రికెటర్లకు బోర్డు నుంచి రావాల్సిన బకాయిలన్నింటినీ క్లియర్ చేశాడు. బోర్డు అడ్మినిస్ట్రేషన్లోకి తన సహచరులు రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్మణ్లను ఒప్పించి తీసుకొచ్చాడు. అయితే టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని బలవంతంగా తప్పించాడనే అపవాదును మూటగట్టుకున్నాడు. అంతేకాకుండా టీమ్ సెలెక్షన్లో అతిగా జోక్యం చేసుకున్నాడనే ఆరోపణలను ఎదుర్కొన్నాడు.