
హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా చేశాడంటూ సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం జరుగుతోంది. గంగూలీ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడని, సెక్రటరీ జైషా ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టాడని బీసీసీఐ పేరిట ఉన్నఓ ఫేక్ ట్విటర్ అకౌంట్ పేర్కొంది. ఇది నిజమేనని నమ్మిన కొన్ని స్థానిక న్యూస్ చానెల్స్ ఈ ఫేక్ ట్వీట్ను వార్తగా ప్రచారం చేశాయి. ఓ ప్రముఖ టీవీ చానెల్లో స్క్రోలింగ్ రావడంతో ఇంకొన్ని వెబ్ సైట్, న్యూస్ యాప్స్ నిజ నిజాలు తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించాయి.
దాంతో అభిమానులు అయోమయానికి గురయ్యారు. అయితే ఇది ఫేక్ వార్త అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వేగంగా వార్తలు ఇవ్వాలనే ఆతృతలో నిజనిజాలు తెలుసుకోకుండా న్యూస్ చానెల్స్ తప్పిదాలు చేస్తున్నాయని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గంగూలీ రాజానామా అంటూ ఫేక్ న్యూస్ రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో అతను చేసిన ఓ ట్వీట్ను కూడా తప్పుగా అర్థం చేసుకున్న మీడియా చానెళ్లు రాజీనామా చేశాడంటూ ప్రచారం చేశాయి.
చివరకు సెక్రటరీ జై షా వచ్చి వివరణ ఇచ్చేంతవరకు ఆ వార్తల ప్రచారం ఆగలేదు. బీసీసీఐ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కరోనా వైరస్, లాక్డౌన్ వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించిన దాదా.. ఐపీఎల్ 2020, ఐపీఎల్ 2021, ఐపీఎల్ 2022 సీజన్లను సక్సెస్ఫుల్గా నిర్వహించాడు. ప్రసార హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి రూ.48 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెట్టాడు.

అయితే అతని హయాంలో విరాట్ కోహ్లీని వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం దుమారం రేపింది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి, విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న విభేదాల కారణంగా అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో కోహ్లీ ఫ్యాన్స్, గంగూలీపై పీకల దాకా కోపంతో ఉన్నారు. ఐసీసీ ఛైర్మెన్గా ఉన్న గ్రెగ్ బార్క్లే, త్వరలో ఆ పదవి నుంచి తప్పుకోబోతుండడంతో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, ఆ పొజిషన్ని చేపట్టబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గంగూలీ, ఐసీసీ ఛైర్మెన్గా బాధ్యతలు తీసుకోవాలంటే బీసీసీఐ ప్రెసిడెంట్గా తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ లాజిక్ను అడ్డం పెట్టుకునే తరుచూ ఇలాంటి ఫేక్ న్యూస్ను నకిలీగాళ్లు ప్రచారం చేస్తున్నారు.