టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టును రోహిత్ అద్భుతంగా నడిపిస్తున్నాడని కొనియాడాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్ట్ల సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది.
తొలి టెస్ట్లో పరాజయం ఎదురైనా.. సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా.. కుర్రాళ్లతో కలిసి రోహిత్ జట్టుకు అసాధారణ విజయాలు అందించాడు. దాంతో అతని సారథ్యంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే సౌరవ్ గంగూలీ సైతం రోహిత్ కెప్టెన్సీని కొనియాడాడు. ఈ విజయాలను ఊహించే రోహిత్ శర్మను కెప్టెన్ చేశానని చెప్పుకొచ్చాడు.

ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'రోహిత్ శర్మ అసాధారణమైన కెప్టెన్. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో అతను భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. వన్డే ప్రపంచకప్లోనూ అద్భుతమైన సారథ్యంతో భారత్ను ఫైనల్ చేర్చాడు. అతను అద్భుతమైన సారథి.
ఈ అసాధారణమైన కెప్టెన్సీ స్కిల్స్ రోహిత్ శర్మకు ఉన్నాయనే అతన్ని నేను కెప్టెన్ చేశాను. కాబట్టి సారథిగా అతను సాధించిన విజయాలు నన్నేం ఆశ్చర్యపర్చలేదు.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
భారత ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ల విషయంలో బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. దేశవాళీ క్రికెట్ ఆడని శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల సెంట్రల్ కాంట్రాక్ట్ తొలిగించడం సరైన చర్యేనని అభిప్రాయపడ్డాడు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ ఆడకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.
దేశవాళీ క్రికెట్ ఆడకపోవడం ఇషాన్, అయ్యర్ చేసిన తప్పిదంగా భావిస్తున్నానని తెలిపాడు. 'ఇషాన్, శ్రేయస్లను బీసీసీఐ రంజీ క్రికెట్ ఆడాలని కోరింది. కానీ వారు ఎందుకు ఆడలేదో నాకు అర్థం కావడం లేదు. రంజీ ట్రోఫీ ప్రీమియర్ టోర్నీ. ఇషాన్, అయ్యర్ విషయంలో బీసీసీఐ చేసిన పని సరైనదే. దేశంలో క్రికెట్కు రంజీ ట్రోఫీ ఆధారం. కాంట్రాక్ట్ ప్లేయర్ అయినా కూడా రంజీ క్రికెట్ ఆడాలని బోర్డు ఆశిస్తోంది.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.