
కోల్కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ తన పెద్ద మనసును చాటుకున్నాడు. కరోనా కకలావికలంతో ఎందరో అభాగ్యులు తిండిలేక తిప్పలు పడుతున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత్లో 21 రోజుల లాక్డకౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు.. యాచకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరంతా ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో అభాగ్యులను ఆదుకోవడానికి సంపన్నులు ముందుకు రావాలని ప్రధానమోదీ పిలుపు నిచ్చారు. ఈ పిలుపుతో చాలా మంది తమ సాయాన్ని ప్రకటించారు. క్రీడారంగం నుంచి కూడా పెద్ద ఎత్తున విరాళాలు అందయ్యాయి.
ఈ నేపథ్యంలోనే పేదలకు బియ్యం పంపిణీ కోసం సౌరవ్ గంగూలీ రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం షెల్టర్లలో ఉంటున్న వారికి ఓ రైస్ సంస్థతో ఆ సాయం కూడా చేశాడు. తాజాగా బెళుర్ మఠం సందర్శించిన దాదా 20 క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశాడు. ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా తెలియజేశాడు. '25 ఏళ్ల తర్వాత బెళుర్ మఠాన్ని సందర్శించాను. పేద ప్రజల కోసం 2000 కేజీల బియ్యాన్ని అందించాను'అని వాటికి సంబంధించిన ఫొటోలను జత చేసి ట్వీట్ చేశాడు.
ఇక గంగూలీతో పాటు సచిన్, రోహిత్, విరాట్ కోహ్లీ, రైనా, ధావన్, రహానే తమ సాయాన్ని ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్కు అందజేశారు. మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్, పూనమ్ యాదవ్ తదితరులు కూడా విరాళలు ప్రకటించారు. బీసీసీఐ కూడా రూ.51 కోట్లు సాయాన్ని అందజేసింది.
ఇక మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. ఈ మహమ్మారి కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య..ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణపై బీసీసీఐ ఎటు తేల్చుకోలేకపోతుంది. అయితే ప్రస్తుతం ఈ మెగాటోర్నీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను పూర్తిగా పర్యవేక్షిస్తుందని, అదుపులోకి వచ్చిన తర్వాతా ఓ నిర్ణయానికి రావచ్చంటుంది.