
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు జారీచేయాలని తాను అనుకున్నట్లు వచ్చిన వార్తలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కొట్టిపారేసాడు. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, అర్థరహితమైన కథనాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు తాను అలాంటి ఆలోచన కూడా చేయలేదని స్పష్టం చేశాడు. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియట్లేదని అసహనం వ్యక్తం చేశాడు.
వన్డే కెప్టెన్సీ మార్పు నేపథ్యంలో విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య రేగిన రగడ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడని, అతని నుంచి వివరణ కోరేందుకు షోకాజ్ నోటీసులు పంపించాలనుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే గంగూలీని బీసీసీఐ సెక్రటరీ జై షా అడ్డుకున్నాడని, గొడవ పెద్దది అవుతుందని దాదాను వారించాడని జాతీయ మీడియా వరుస కథనాలు ప్రచురించింది. ఈ వార్తలపై స్పందించిన గంగూలీ ఇవన్నీ గాలి వార్తలనేనని స్పష్టం చేశాడు.
టీ20 ప్రపంచకప్ ముందే టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించగా... వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తొలగించింది. వన్డే, టీ20లకు భిన్న సారథ్యం సరికాదన్న వాదనను బీసీసీఐ తెరపైకి తీసుకొచ్చింది. రెండు ఫార్మాట్లకు కెప్టెన్లుగా వేరువేరుగా ఉంటే జట్టుపై తీవ్రప్రభావం పడుతుందని పేర్కొంది. దీంతో సౌతాఫ్రికాతో వన్డేలకు కెప్టెన్గా, టెస్టులకు వైస్ కెప్టెన్గా రోహిత్ను నియమించింది. ఈ సమయంలో బీసీసీఐ నుంచి మీడియాకు కొన్ని లీకులు వెళ్లడం కోహ్లీని మనస్తాపానికి గురిచేశాయి. తనపై జరుగుతున్న ప్రచారానికి సౌతాఫ్రికాకు వెళ్లే ముందు విలేకరుల సమావేశంలో కోహ్లీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
వన్డే కెప్టెన్సీ మార్పు విషయంలో స్పష్టమైన సమాచారం లేదని పేర్కొన్నాడు. ఇక టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవద్దని తాను స్వయంగా విరాట్ కోహ్లీని విజ్ఞప్తి చేసానని గంగూలీ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. అలాంటిదేం జరగలేదని, టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని ఎవరూ సూచించలేదన్నాడు. విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి.