Sourav Ganguly: యూఏఈలోనే టీ20 వరల్డ్కప్.. తరలించడానికి కారణం అదే

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ వేదిక మారింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లలో భారత్లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ను యూఏఈకి తరలిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 'ప్రపంచకప్ వేదికను యూఏఈకి మారుస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి సమాచారం ఇచ్చాం. టోర్నీతో ప్రమేయం ఉన్న అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం' అని గంగూలీ చెప్పాడు.
టోర్నీ జరిగేది యూఏఈలోనే అయినా ఆతిథ్యమిచ్చేది బీసీసీఐనే. అక్టోబరు 17న టోర్నీ ఆరంభాన్ని ఖరారు చేశారా? అని అడిగినప్పుడు.. 'టోర్నీ షెడ్యూల్తో పాటు ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం. అక్టోబర్ 17న టోర్నీ ప్రారంభమనేది ఇంకా ఖాయం కాదు. క్వాలిఫయర్ మ్యాచ్లు ఒమన్లో జరుగుతాయి. ప్రధాన టోర్నీ గ్రూప్ మ్యాచ్లు యూఏఈలో ఉంటాయి'' అని గంగూలీ చెప్పాడు. ఐసీసీ ప్రతినిధి కూడా టోర్నీ ప్రారంభ తేదీని ఇంకా నిర్ణయించలేదన్నాడు. మరోవైపు ఏ పరిస్థితుల్లో ప్రపంచకప్ను తరలించాల్సి వచ్చిందో వివరిస్తూ అన్ని రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ కార్యదర్శి జై షా లేఖ రాశాడు.
'కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్లేయర్ల సేఫ్టీ, ఇతర స్టేక్ హోల్డర్స్ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని వరల్డ్ కప్ తరలింపు నిర్ణయం తీసుకున్నాం. మెగా ఈవెంట్ను భారత్లో నిర్వహించాలని మేము కూడా భావించాం. కానీ తరలించక తప్పలేదు. యూఏఈలో గత ఐపీఎల్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆ అనుభవంతో వరల్డ్కప్ కూడా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది.'అని జైషా పేర్కొన్నాడు.
ఇక వరల్డ్కప్ను యూఏఈ తరలించడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఈ మెగా టోర్నీకి భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభించకపోవడం మొదటిది అయితే... కరోనా కారణంగా ఐపీఎల్ 2021 వాయిదా పడిన నేపథ్యంలో 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు భారత్కు వస్తారా? అన్నది రెండోది. యూఏఈలో టోర్నీ జరిగితే బీసీసీఐకి 41 శాతం ఆర్థిక లాభం చేకూరనుంది. ఒకవేళ భారత్లో ఈ టోర్నీ జరిపితే ప్రభుత్వానికి భారీగా పన్ను కట్టాల్సి వచ్చేది. 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్నకు సంబంధించిన పన్ను మినహాయింపు ఇప్పటివరకు లభించకపోవడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications