అసలేం జరిగిందంటే..?
ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో భారత మహిళల జట్టు 9 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ను హర్మన్ ప్రీత్ సేన అనవసర ఒత్తిడితో చేజార్చుకుంది. 12 బంతుల్లో 17 పరుగులు చేయలేక మూల్యం చెల్లించుకుంది. దాంతో తొలిసారి మహిళా క్రికెట్కు అవకాశం కల్పించిన కామన్వెల్త్ గేమ్స్లో రన్నరప్గా నిలిచి సిల్వర్ మెడల్తో సరిపెట్టుకుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గంగూలీ ట్వీట్ చేశాడు. అభినందనలు తెలిపిన దాదా.. గెలవాల్సిన మ్యాచ్లో భారత అమ్మాయిలు ఓడారని, దానికి వారు చింతిస్తారని పేర్కొన్నాడు.
దాదా ట్వీట్ మిస్ఫైర్..
'సిల్వర్ మెడల్ గెలిచినందుకు భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు. అయితే వాళ్లు మాత్రం స్వదేశానికి అసంతృప్తిగానే వస్తారు. ఎందుకంటే గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిపాలయ్యారు. దాదాపు మ్యాచ్ వాళ్ల చేతులోని ఉన్నట్లు అనిపించింది.'అంటూ గంగూలీ ట్వీట్ చేశాడు. గంగూలీ చేసిన ఈ ట్వీట్ను అపార్థం చేసుకున్న నెటిజన్లు అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. వాస్తవానికి దాదా.. అమ్మాయిల ప్రదర్శనను కించపర్చాలనే ఉద్దేశంతో ఈ ట్వీట్ చేయలేదు. గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిపాలయ్యారని, అందుకే బాధపడతారని పేర్కొన్నాడు. కానీ అది కాస్త మిస్ ఫైర్ కావడంతో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు.
బీసీసీఐ బాస్గా ఏం చేశావంటూ..
తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి, దాదాపు స్వర్ణం గెలిచినంత పని చేసినందుకుగాను టీమిండియాను మనస్పూర్తిగా అభినందించాల్సింది పోయి, హేళన చేసేలా వ్యాఖ్యలు చేస్తావా అంటూ దాదాపై అభిమానులు మండిపడుతున్నారు. అసలు దాదా చేసిన ట్వీటే అతిపెద్ద అసంతృప్తి కలిగిస్తోందని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి బోర్డు ప్రెసిడెంట్గా ఉండటం దురదృష్టకరమని, అమ్మాయిల క్రికెట్ కోసం బీసీసీఐ ప్రెసిడెంట్గా ఏం చేశావని నిలదీస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యాడు.
హర్మన్ పోరాడినా..
ఫైనల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులే చేసింది. ఆసీస్ బ్యాటర్లలో బెత్ మూనీ(61), కెప్టెన్ మెగ్ లాన్నింగ్(36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. స్వింగ్ కింగ్ రేణుకా సింగ్(2/25), స్నేహ్ రాణా(2/38) రెండేసి వికెట్లు తీయడంతో పాటు దీప్తి శర్మ(1/30), రాధా యాదవ్(1/24) చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు షెఫాలి (11), స్మృతి (6) త్వరగా వెనుదిరిగినా.. జెమీమా (33)తో కలిసి హర్మన్ప్రీత్ (65) పోరాడడంతో 14 ఓవర్లకు 112/2తో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. గార్డ్నర్ (3/16), షట్ (2/27) భారత్ను దెబ్బతీసారు


Click it and Unblock the Notifications
