
ముంబై: గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ (కొవిడ్-19) ముప్పు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్కు ఏ మాత్రం ఉండదని గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు. దేశంలో రెండు కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు రేకెత్తాయి. మార్చి 29న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్తో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుంది. మ్యాచ్లు చూసేందుకు వేలాది మంది ప్రేక్షకులు మైదానాలకు వచ్చే అవకాశం ఉండటంతో కరోనా వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉందని..ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహించడం కష్టమేననే ఉహాగానాలు వినిపించాయి.
అయితే ఇవన్నీ గాలి వార్తాలేనని బ్రిజేష్ కుమార్ మంగళవారం స్పష్టం చేశారు. కరోనా వైరస్ గురించి ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నట్లు తెలిపాడు. కరోనా ముప్పు ఐపీఎల్కు ఏమాత్రం ఉండబోదన్నాడు. ఇక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం ఈ ఊహాగానాలను ఖండించాడు. ఐపీఎల్కు సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు కరోనా వైరస్తో వచ్చే సమస్యే లేదన్నాడు. భారత్లో కరోనా వైరసే లేదని, దానిపై చర్చ కూడా అనవసరమని తెలిపాడు. షెడ్యూల్ ప్రకారమే సౌతాఫ్రికా జట్టుకు భారత్కు వస్తుందని మ్యాచ్లు ఆడుతుందన్నాడు. మార్చి 12న ధర్మశాల వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
ఇక ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే 3100 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సుమారు 90000 మందికి ఈ మహమ్మారి సోకింది. దీని దెబ్బకు చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దయ్యాయి. ఒలింపిక్స్ నిర్వహణపై కూడా అనుమానం నెలకొంది.